భారత్తో మూడో టెస్ట్లో డీఆర్ఎస్ నిర్ణయాలు తమకు కలిసి రాలేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. అయితే ఈ నిర్ణయాల వల్లనే తాము ఓడిపోలేదని, హాక్ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందని తెలిపాడు. అలానే అంపైర్స్ కాల్స్ రూల్స్ను కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నాడు.
రాజ్కోట్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న బెన్ స్టోక్స్.. అంపైర్స్ కాల్స్ వల్ల తమకు తీరని నష్టం జరిగిందని చెప్పాడు.

'జాక్ క్రాలే డీఆర్ఎస్ను గమనిస్తే బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్లు అనిపించింది. కానీ అంపైర్స్ కాల్ అని ఔటిచ్చారు. ఈ వికెట్పై మరింత క్లారిటీ అవసరం. బంతి స్టంప్స్ను తాకినట్లే రిప్లేలో కనిపించలేదు. దాంతో మేం కాస్త గందరగోళానికి గురయ్యాం. హాక్ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందనిపించింది.
దీని గురించి ఎవర్నీ నిందించడం లేదు. డీఆర్ఎస్ల్లో మాకు మూడు సార్లు అంపైర్స్ కాల్ వచ్చింది. అది సరైందా? కాదా? అనేది పక్కన పెడితే.. మేం మాత్రం వికెట్లు కోల్పోయాం. వీటి వల్లే ఓడిపోయానని నేను చెప్పడం లేదు. ఎందుకంటే 500 ప్లస్ లక్ష్యాన్ని చేధించడం అంత సులువైన పని కాదు. డీఆర్ఎస్ టెక్నాలజీపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ఫీల్డ్ అంపైర్లు కఠినమైన విధులను నిర్వర్తిస్తారని తెలుసు. భారత్ వంటి టర్నింగ్ ట్రాక్లపై ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు అంపైర్స్ కాల్ అనే ఆప్షన్ను పక్కనపెడితే బాగుంటుంది. దీనిపై ఎక్కువగా మాట్లాడలేను. ఈ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి.. ఏం చెప్పినా దానిని సాకుగా భావిస్తారు.'అని స్టోక్స్ వెల్లడించాడు.
ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నప్పుడు.. రిప్లేలో బంతి.. వికెట్లు తాకే విషయంలో సందిగ్ధత ఉంటే అంపైర్స్ కాల్గా ఇస్తారు. అప్పుడు ఫీల్డ్ అంపైర్ ఏ నిర్ణయం ప్రకటిస్తే దానికే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్ను మార్చాలనే డిమాండ్ చాలా రోజులుగా వినబడుతోంది. హాక్ ఐ టెక్నాలజీలో బంతి స్టంప్స్ను ఎంత శాతం తాకిందనేది సంబంధం లేకుండా.. స్టంప్స్ను తాకే అవకాశం ఉంటే ఔటిచ్చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.