ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కెప్టెన్సీ కెరీర్లో ఇదో గొప్ప విజయమని తెలిపాడు. విజయానంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్.. భారత ఆటతీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళికలు రచించామని చెప్పాడు.
'నేను ఇంగ్లండ్ టెస్ట్ సారథ్య బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాం. గొప్ప విజయాలు సాధించాం. కొన్నింటిలో ఓడినా అసాధారణ మ్యాచ్ల్లో భాగమయ్యాం. వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా గొప్ప ప్రదర్శన కనబర్చాం. ఈ విజయం చాలా గొప్పది. కెప్టెన్గా విదేశాల్లో నేను సాధించిన తొలి విజయం ఇదే.

నేను మ్యాచ్ను బాగా పరిశీలిస్తాను. తొలి ఇన్నింగ్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. భారత స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు? వారిని రోహిత్ ఎలా వాడుకుంటున్నాడు? ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎలా ఉందని బాగా పరిశీలించాను. మా ఫీల్డింగ్ సమయంలో రోహిత్లా ఫీల్డ్ సెట్ చేయడంతో పాటు బౌలర్లను మార్చే ప్రయత్నం చేశాం.
ఈ విజయం ప్రతీ ఒక్కరిని థ్రిల్ చేసింది. అరంగేట్రంలో టామ్ హార్ట్లీ 9 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లోనే ఓలీ పోప్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి సారి జట్టులోకి వచ్చిన హార్ట్లీ.. ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ విజయం అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.
ఏం జరిగినా అతనితో సుదీర్ఘంగా బౌలింగ్ చేయించాలనుకున్నాను. మేం సెలెక్ట్ చేసిన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాం. ఉపఖండంపై ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండటం నా అదృష్టం. జోరూట్కు కూడా ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. నెంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చి ఓలిపోప్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో పాటు అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఉపఖండంపై అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన ఏకైక ఇంగ్లీష్ బ్యాటర్ అతనే. పరాజయాలకు ఏ మాత్రం భయపడను. చివరి నాలుగు మ్యాచ్ల్లోనూ ఇదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(39), కేఎస్ భరత్(28), అశ్విన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ(7/62) ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోరూట్, జాక్ లీచ్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) రాణించారు. దాంతో భారత్కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్తో 420 పరుగులు చేసింది. ఈ ఓటమితో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది.