టీమిండియా క్వాలిటీ బౌలింగ్తో పాటు యువ బ్యాటర్ల మెరుగైన ప్రదర్శన కారణంగానే ఈ సిరీస్లో ఘోర పరాజయాన్ని చవి చూసామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. భారత యువ బ్యాటర్లను కట్టడి చేయకపోవడం తమ పతనాన్ని శాసించిందని చెప్పాడు. ఈ సిరీస్లో ఓడినా ఎన్నో సానుకూలంశాలు లభించాయని, సమ్మర్ మ్యాచ్లకు ముందు ఇవి తమకు ఎంతగానో ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డాడు.
ధర్మశాల వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

'ఎన్నో ఆశలతో భారత్ గడ్డపై అడుగుపెట్టాం. కానీ చెత్త ప్రదర్శనతో 4-1తో చిత్తయ్యాం. ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కానీ మేం అత్యుత్తమ జట్టు చేతిలో ఓడాం. జట్టుగా.. వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శనతో ఈ సిరీస్ను మేం మరింత స్పూర్తిదాయకంగా నిలపాలనుకున్నాం.
బజ్బాల్ అర్థం ఏంటనే ప్రశ్న మాకు ఎదురైంది. బజ్బాల్ అంటే జట్టుగా.. వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేయడం. ఈ సిరీస్లో ఓడినా మాకు కొన్ని సానుకూలంశాలు లభించాయి. ఈ ఏడాది మేం చాలా క్రికెట్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఈ సిరీస్ను మొత్తంగా చూస్తే మాకు వచ్చిన కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం.
ఈ సిరీస్లో మేం ఎక్కడ తప్పిదం చేశామనే విషయం జట్టులోని ప్రతీ ఒక్కరికి తెలుసు. టీమిండియాలో క్వాలిటీ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు సత్తా చాటుతున్నప్పుడు.. వారికి అండగా బ్యాటర్లు రాణిస్తారు. అయితే ఆ బ్యాటర్లతో పాటు బౌలర్లను దెబ్బతీసే ప్రయత్నం చేయాలి.
ఇది కాస్త రిస్కే అయినా.. ప్రతికూల ఫలితం ఎదురైనా.. వారిని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఆడాలి. టాపార్డర్లో జాక్క్రాలీ, బెన్ డక్కెట్లు నిలకడగా భాగస్వామ్యాలు నెలకొల్పడం.. సిరీస్ మొత్తం బషీర్, టామ్ హార్ట్లీ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చడం, సిరీస్ చివర్లో జోరూట్ ఫామ్లోకి రావడం మాకు లభించిన సానుకూలంశాలు.
జేమ్స్ అండర్సన్తో కలిసి ఆడటం అద్భుతమైన అనుభూతినిస్తోంది. ఓ ఫాస్ట్ బౌలర్గా టెస్ట్ల్లో 700 వికెట్లు పడగొట్టడం అసాధారణం. క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి 700 వికెట్ల ఘనతను అందుకునే వరకు అతను అదే నిబద్దత, కోరికతో ఆడటం గొప్ప విషయం. నేను చూసిన అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్లలో జేమ్స్ అండర్సన్ ఒకరు.
అతను రికార్డుల కోసం క్రికెట్ ఆడటం లేదు. జట్టు కోసం తన దేశం కోసం ఆడుతున్నాడు. అందుకే అతను 700 వికెట్లు తీసినా పెద్దగా సంబరాలు చేసుకోలేదు.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
259 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రవిచంద్రన్ అశ్విన్(5/77) ధాటికి 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్(128 బంతుల్లో 12 ఫోర్లతో 84) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39) కాసేపు క్రీజులో నిలుచున్నాడు. అశ్విన్కు అండగా.. జస్ప్రీత్ బుమ్రా(2/38), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు 473/8 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 4 పరుగుల వ్యవధిలో చివరి రెండు వికెట్లు కోల్పోయి 477 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులే చేసిన విషయం తెలిసిందే.