లార్డ్స్: మైదానంలో అనైతిక చర్యలతో సాధించే విజయం కంటే ఓడిపోవడమే ఉత్తమమని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ 43 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుకంజలో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో జానీ బెయిర్ స్టో ఔటైన విధానం వివాదాస్పదమైంది. చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లండ్ 193/5గా ఉన్న సమయంలో.. కామెరూన్ గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు.

బెయిర్స్టో, స్టోక్స్తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు, స్టాండ్స్లోని అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించి బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు షాక్లో మునిగిపోయారు.
ఇది అనైతికమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్తో బెయిర్స్టో, మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ మాట్లాడినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు రెండుగా విడిపోయారు. కొందరు అలెక్స్ క్యారీ తెలివని మెచ్చుకుంటే మరికొందరు ఆసీస్ తొండాట అంటూ మండిపడుతున్నారు.
మ్యాచ్ అనంతరం ఈ వ్యవహారంపై బెన్ స్టోక్స్ ఘాటుగా స్పందించాడు. 'బెయిర్ స్టో ఔట్ను నేను వివాదాం చేయదలుచుకోవడం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం అది ఔట్. ఓవర్ పూర్తయిందని మీరు అన్నారా? అని అంపైర్లను నేను అడిగాను. వారు అలా అనలేదని చెప్పారు. ఆస్ట్రేలియాకు అది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్.
విజయం కోసం వారు వచ్చిన అవకాశాన్ని వాడుకున్నారు. అయితే ఈ పద్దతిలో మీరు గెలవాలనుకుంటారా? అని నన్ను అడిగితే మాత్రం లేదు అని సమాధానం చెబుతా. క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తే వచ్చే విజయం మాకు అవసరం లేదు. నేను అయితే అప్పీల్ను వెనక్కి తీసుకొనేవాడిని.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. గతంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని, నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్నామని స్టోక్స్ తెలిపాడు.
2-0తో సిరీస్లో వెనుకబడినా.. చివరి మూడు టెస్ట్ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. విజయం కోసం తాను చేసిన పోరాటం సరిపోలేదని చెప్పుకొచ్చాడు.