ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో విరాట్ ఈ సిరీస్కు దూరంగా ఉన్నాడు. తొలుత మొదటి రెండు మ్యాచ్లు ఆడనని చెప్పిన కోహ్లీ.. చివరి మూడు మ్యాచ్లకు కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఏ కారణం చేత అతను ఈ సిరీస్కు బ్రేక్ ఇచ్చాడనే విషయం అర్థం కావడం లేదు. రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని ఏబీ డివిలియర్స్ తొలుత చెప్పినా.. అందులో వాస్తవం లేదని తర్వాత స్పష్టం చేశాడు. తన తల్లి అనారోగ్యంగా ఉందని జరిగిన ప్రచారాన్ని కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఖండించాడు. తన తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఎలాంటి పోస్ట్ షేర్ చేయలేదు. గత నెల 21 నుంచి వారి ఖాతాల్లో కొత్త పోస్ట్ షేర్ అవ్వలేదు. విరాట్ కోహ్లీ లేని సిరీస్ చాలా బోరింగ్గా ఉందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అభిమానులు కామెంట్ చేశారు. తాజాగా మూడో టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న బెన్ స్టోక్స్ను ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ప్రతీ ఒక్కరు విరాట్ కోహ్లీని మైదానంలో చూడాలనుకుంటున్నారు. ఎవరైనా అత్యుత్తమ ఆటగాళ్ల ఆటనే చూడాలనుకుంటారు. బెస్ట్ ప్లేయర్లలో కోహ్లీ ఒకడు. అతను అతి త్వరగా మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
ఇక రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్ బెన్ స్టోక్స్ కెరీర్లో 100 టెస్ట్ మ్యాచ్. ఈ ఘనత గురించి బెన్ స్టోక్స్ను ప్రశ్నించగా.. ఇదేం స్పెషల్ కాదని తెలిపాడు. మిగతా మ్యాచ్ల్లానే 100 మ్యాచ్ను చూస్తానని చెప్పాడు.
'ప్రతీ టెస్ట్ మ్యాచ్ తదుపరి మ్యాచ్లా ముఖ్యమైనదే. ఇది కెరీర్ కొనసాగింపునకు సంకేతం. అంతేకానీ 99, 100, 101 టెస్ట్ల్లో తేడా ఏం లేదు. ఇది ఒక అంకె మాత్రమే.'అని బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు.