టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతోనే రెండో టెస్ట్లో ఓటమిపాలయ్యామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఈ మ్యాచ్లో ఓడినా.. ఓ మంచి మ్యాచ్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
ఈ విజయంతో హైదరాబాద్ టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బెన్ స్టోక్స్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'భారత్ విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించగలమని మేం నమ్మాం.

ఇలాంటి సవాళ్లను స్వీకరించడం మాకు కొత్త కాదు. గతంలోనూ ఈ తరహా మ్యాచ్ల్లో విజయం సాధించాం. స్కోర్ బోర్డు ఒత్తిడి ఉన్నప్పుడే మనలోని అత్యుత్తమ ఆటతీరు బయటపడుతోంది. వ్యక్తిగతంగా రాణించే ఆస్కారం లభిస్తోంది. ఈ తరహా మైండ్సెట్తోనే గత మ్యాచ్లో భారత్ను ఓడించి వారిని ఒత్తిడిలోకి నెట్టాం. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం.
విదేశాల్లో ఎలా ఆడాలనేదానిపై కెప్టెన్గా నాకు ఎవరూ ఎలాంటి సూచనలు చేయలేదు. ఈ పర్యటనను మేం ఓ టాస్క్గా భావించాం. మా ముందు 330 ప్లస్ రన్స్ లక్ష్యం నమోదవుతుందని ఊహించాం. మా జట్టులో ప్రతీ ఒక్కరూ నాణ్యమైన ఆటగాళ్లే. అనుభవం లేని మా స్పిన్ అటాక్తో బరిలోకి దిగడాన్ని నేనేం సవాల్గా తీసుకోవడం లేదు.
వారితో బరిలోకి దిగేందుకు ఇష్టపడుతున్నాడు. టామ్, బాష్, రెహాన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆదివారం అసాధారణ ప్రదర్శనతో భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. బౌలింగ్లో ఎంతో పరిణితి, నైపుణ్యం చూపించారు. జేమ్స్ అండర్స్ అసాధారణ బౌలర్. అండర్స్, బుమ్రాలు దిగ్గజ బౌలర్లు. ప్రత్యర్థి జట్టులో ఉన్నా.. బుమ్రాను మెచ్చుకోకుండా ఉండలేం. అలాంటి బౌలరే జేమ్స్ అండర్సన్. బుమ్రా అసాధారణ ప్రదర్శనతోనే ఇంగ్లండ్ విజయవకాశాలు దెబ్బతిన్నాయి.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బెన్ ఫోక్స్(69 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్తో 36), టామ్ హార్ట్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(3/72), జస్ప్రీత్ బుమ్రా(3/46) మూడేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు.
అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.