ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం చర్చనీయాంశమైంది. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో రెండు రోజుల్లో 36 వికెట్లు నేలకూలాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు కుప్పకూలగా.. రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. దాంతో ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ పిచ్పై అసహనం వ్యక్తం చేశాడు. పిచ్ ఏకపక్షంగా బౌలర్లకు సహకరించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. చెత్త పిచ్ కారణంగానే ఓటమిపాలయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఈ పిచ్ను నిందించాడు. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం సరికాదన్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఇలా జరిగిన పెద్ద రచ్చ అయ్యేది అభిప్రాయపడ్డాడు. 'బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం కచ్చితంగా సరైన విషయం కాదు. కానీ మనం దాన్ని మార్చలేం. ఇదే గనుక ప్రపంచంలో మరెక్కడైనా జరిగి ఉంటే.. దానిపై పెద్ద రచ్చ జరిగేది.'అని బెన్ స్టోక్స్ బదులిచ్చాడు.
ఈ మ్యాచ్ విజయంపై బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించిన జట్టులో భాగం కావడం గొప్పగా ఉందని చెప్పాడు. 'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఇప్పటి వరకు ఈ పర్యటన చాలా కష్టంగా సాగింది. ఒక జట్టుగా మాకు సవాళ్లు ఎదురయ్యాయి. కానీ సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై గెలిచిన జట్టులో భాగం కావడం గొప్పగా ఉంది.
బార్మీ ఆర్మీ చాలా ప్రత్యేకం. వారు మైదానంలో చేసే సందడి మాకు స్ఫూర్తిని ఇస్తోంది. ఈ మ్యాచ్కు ముందు మాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడి, ఒక పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించాం. ఆ క్రెడిట్ మా ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, మేనేజ్మెంట్కు దక్కుతుంది. వారంతా క్రికెట్పైనే ఫోకస్ పెట్టేలా చేశారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్ చాలా తక్కువ సమయంలో ముగిసినా.. ఎంతో ఉత్కంఠగా సాగింది. పిచ్ బౌలర్లకు విపరీతంగా సహకరించింది. కానీ ఈరోజు మేం సరైన పద్ధతిలో ఆడాం. మేము మైదానంలో ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించాం'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.