రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అసాధారణ ప్రదర్శనతోనే గెలిచే మ్యాచ్లో ఓడామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఇంగ్లండ్, భారత్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకొని కూడా ఇంగ్లండ్ విజయాన్నందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ డ్రా క్రెడిట్ జడేజా, సుందర్దేనని చెప్పిన స్టోక్స్.. వారిని ఎంత ప్రశంసించినా తక్కువేనన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం ముఖ్యమని చెప్పాడు.
'ఒక ఆల్రౌండర్గా ఎంత బాగా ఆడారనేది మ్యాచ్ ఫలితం ద్వారానే అంచనా వేస్తాం. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో మేం గెలిచి ఉంటే నా వ్యక్తిగత ప్రదర్శనకు విలువ దక్కేది. జట్టు విజయం కోసం ఏం చేయడానికి సిద్దంగా ఉండాలని మా ఆటగాళ్లకు చెప్పాను. నేను అదే చేశాను. బౌలింగ్, ఫీల్డింగ్లో నిరంతరం శ్రమించడం చాలా కఠినమైన పని. నా శరీరం కూడా చాలా అలసిపోయింది. ఆట సాగే కొద్దీ వికెట్ బ్యాటింగ్కు మరింత అనుకూలంగా మారింది.

కుడిచేతి వాటం బ్యాటర్లకు అనూహ్య బౌన్స్ కొంత ఇబ్బంది పెట్టినా.. ఎడమచేతి వాటం బ్యాటర్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి ఆటను ఎంత కొనియాడిన తక్కువే. ఈ మ్యాచ్ డ్రా క్రెడిట్ వీరిదే. మా తొలి ఇన్నింగ్స్లో బెన్ డకెట్, క్రాలీ భాగస్వామ్యం జట్టుకు గట్టి పునాది వేసింది. ఈ సిరీస్ ఇప్పటి వరకు హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాయి. నిజం చెప్పాలంటే ఇరు జట్లు నాణ్యమైన క్రికెట్ ఆడాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అద్భుతంగా ఆడి వారి సత్తాను చూపెట్టింది. ఈ మ్యాచ్లో గెలిచేందుకు మేం ప్రతీది ప్రయత్నించాం. కానీ వారు ఆఖరి వరకు ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా పోరాడారు.
ఒత్తిడిని అధిగమించేందుకు టీమిండియా చేయాల్సిన హార్డ్ వర్క్ మొత్తం చేసింది. జడేజా, సుందర్ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీల దిశగా సాగారు. సెంచరీలు పూర్తి చేయాలనుకున్నారు. నేను నా ఫాస్ట్ బౌలర్లతో రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే డ్రా కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని అడిగాను. అప్పటికే డాసన్ కూడా చాలా ఓవర్లు వేసాడు. ఆఖరి మ్యాచ్కు ముందు బౌలర్లు గాయాల బారిన పడకుండా కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించాను.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
రవీంద్ర జడేజా(185 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 101 నాటౌట్) అజేయ శతకాలతో చెలరేగడంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకుంది. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు అజేయంగా 203 పరుగులు జోడించారు. దాంతో 174/2 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 145 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులు చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)
భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్మన్ గిల్ 103, జడేజా 107*, సుందర్ 101*, క్రిస్ వోక్స్ 2/67)