హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఈ క్యాష్ రిచ్ లీగ్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి స్టోక్స్ తప్పుకున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్లో ఉన్న తల్లిదండ్రులతో గడిపేందుకే స్టోక్స్ వెళ్లాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.
గతేడాది స్టోక్స్ తండ్రి దక్షిణాఫ్రికాలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడితో సమయం గడిపేందుకు స్టోక్స్ అక్కడికి వెళ్లాడు. స్టోక్స్ న్యూజిలాండ్లోనే జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని తండ్రి డెబ్స్టోక్స్ ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం లేదు. స్టోక్స్ ఐపీఎల్ భవితవ్యం అతని తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అధారపడి ఉంది.
అలాగే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగనున్న అప్కమింగ్ సిరీస్తో కూడా స్టోక్స్ ఆడేది, ఆడనిది తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా 26 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయగా.. ఇంగ్లండ్ మాత్రం ప్రకటించలేదు. ఈ సిరీస్లో ఆడితే మాత్రం అందరిలా బెన్ స్టోక్స్ కేవలం ఫస్ట్ వీక్ మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడు.
అలా కాదని ఆ సిరీస్లో ఆడకుంటే మాత్రం చాలా మ్యాచ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత కరోనా నిబంధనల నేపథ్యంలో ఆటగాళ్లు ఏడు రోజుల క్వారంటైన్ పాటించిన తర్వాతనే బయో బబుల్ వాతావరణంలోకి అనుమతిస్తారు. అది కూడా కరోనా పరీక్షల్లో నెగటీవ్ వస్తేనే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడకుండా ఐపీఎల్లో పాల్గొనడం స్టోక్స్కు కష్టంతో కూడుకున్న పనే. ఇక స్టోక్స్ రాజస్థాన్కు ఎంతో విలువైన ఆటగాడు. వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో స్టోక్స్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఫ్రాంచైజీతో పాటు ఆ జట్టు అభిమానులు అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇక ముంబై ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగాది ఇదే పరిస్థితి. ప్రస్తుతం మలింగా మలింగా తండ్రి కూడా అనారోగ్యానికి గురయ్యారు. త్వరలోనే ఆయనకు సర్జరీ చేయాల్సి ఉంది. దీంతో అతను ముంబై జట్టుతో దుబాయ్ వెళ్లకుండా కొలంబోలోనే ఉండిపోయాడు. కరోనా నేపథ్యంలో శ్రీలంకలో విధించిన నిబంధనల నేపథ్యంలోనే అతను రిస్క్ చేయడంలేదని తెలుస్తోంది. దీంతో అతను లీగ్ మ్యాచ్లన్నిటికీ దూరమయ్యే అవకాశం ఉంది.