లండన్: యాషెస్ సిరీస్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్లోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కలిసి మందు కొట్టినట్లు వచ్చిన వార్తలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖండించాడు. కలిసి మందుతాగిన మాట వాస్తవమే అయినా.. అది డ్రెస్సింగ్ రూమ్లో కాదని స్పష్టం చేశాడు. నైట్క్లబ్లో ఇరు జట్ల ఆటగాళ్లు సేద తీరారని తెలిపాడు.
సుమారు నెలన్నర రోజుల పాటు ఉత్కంఠగా సాగిన యాషెస్ సిరీస్కు ఆదివారం తెరపడింది. ది ఓవల్ మైదానం వేదికగా జరిగిన చివరి టెస్ట్లో ఇంగ్లండ్లో 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమవ్వగా డిఫెండింగ్ ఛాంపియన్గా ఆసీస్ రిటైన్ చేసుకుంది.

అయితే టైటిల్ అందుకోకపోయినా నైతిక విజయం తమదే అంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విజయానంతరం ఇంగ్లండ్ ఆటగాళ్ల సంబరాలు ఆలస్యమవ్వడంతో ఆసీస్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే మైదానం వీడారు. అనంతరం ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి వారిని అభినందించారు.
అయితే గంటల తరబడి ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్లోనే ఆసీస్ ఆటగాళ్లు ఉండటంతో అందరూ కలిసి మందేసారని ఇంగ్లండ్ మీడియా పేర్కొంది. ఈ వార్తలను ఖండించిన బెన్ స్టోక్స్ నైట్క్లబ్లో పార్టీ చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
'పార్టీ జరిగిన మాట వాస్తవమే. కానీ డ్రెస్సింగ్ రూమ్లో జరగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ ఆటగాళ్లు మా డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చారు. కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్డ్ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్పై మాట్లాడుతుండటంతో అక్కడే నిలబడ్డారు. మొయిన్ అలీ, బ్రాడ్ స్పీచ్లు వినేందుకు గంట పాటు అక్కడే ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఇదే జరిగింది.
బయట ప్రచారం జరుగుతున్నట్లు డ్రెస్సింగ్ రూమ్లో పార్టీ జరుపుకోలేదు. కానీ లేట్నైట్ ఆసీస్ ఆటగాళ్లతో కలిసి నైట్ క్లబ్లో చిల్ అయ్యాం. నెల రోజుల పాటు యాషెస్ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా.. అది మ్యాచ్ల వరకే పరిమితం చేశాం. ఆఫ్ ఫీల్డ్లో మ్యాచ్కు సంబంధించిన గొడవలను అస్సలు చర్చించం. అందరం కలిసి తెగ ఎంజాయ్ చేశాం. 'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.