జోష్ టంగ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్.. జోష్ టంగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. రెండు ఇన్నింగ్స్లో జోష్ టంగ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ను తమవైపు మలుపు తిప్పాడని కొనియాడాడు.రెండో ఇన్నింగ్స్లో అతని స్పెల్ గేమ్ ఛేజింగ్ మూమెంట్గా నిలిచిందన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై విమర్శలు రాగా.. బెన్ స్టోక్స్ సమర్థించుకున్నాడు.
'లీడ్స్లో మాకు మధుర జ్ఞాపకాలున్నాయి. వాటికి మరొకటి తోడైంది. ఆఖరి రోజు ఆటలో భారీ లక్ష్యాన్ని చేధించడం, ఈ గొప్ప టెస్ట్లో భాగం కావడం అద్భుతం. బంతి వేయకముందే ఏం జరగుతుందో ఊహించలేం. మనకు ఏది మంచిదినపిస్తే ఆ నిర్ణయమే తీసుకుంటాం. బౌలింగ్ ఎంచుకునేటప్పుడు గెలవడానికి మాకు ఏది బెస్ట్ ఆప్షనో దానిపై మాత్రమే ఫోకస్ పెట్టాం.ప్రత్యర్థి మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉన్నా.. బౌలింగ్ ఎంచుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. తొలి రోజు మొదటి సెషన్లో మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ ఆసాంతం ఏ సమయంలోనూ నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఏ మాత్రం అనుకోలేదు.

బెన్ డకెట్ అసాధారణ బ్యాటర్. ఛేజింగ్లో ఓపెనింగ్ చేయడం చాలా కష్టం. కానీ జాక్ క్రాలీతో కలిసి బెన్ డకెట్ అసాధారణ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అది మా విజయానికి గట్టి పునాదిగా మారింది. జాక్ క్రాలీ కూడా నిలకడగా ఆడి విలువైన 60 పరుగులు చేశాడు. ఇద్దరు సమన్వయంతో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. లక్ష్యాలను ఛేదిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ సిరీస్లో మాకు గొప్ప ఆరంభం లభించింది.
ఈ మ్యాచ్ గెలవడానికి మా నైపుణ్యం చాలా ఉపయోగపడింది. ప్రతీ సెషన్లో పై చేయి సాధించాలనే వైఖరితో బరిలోకి దిగాం. జోష్ టంగ్ స్పెల్స్ మ్యాచ్ను మలుపు తిప్పాయి. ఫ్లాట్ వికెట్పై కూడా మా బౌలర్లు ప్రభావం చూపారు. మరోసారి లీడ్స్ వికెట్ ఆఖరి రోజు బాగుంటుందనే విషయం స్పష్టమైంది. మంచి వైఖరితో బరిలోకి దిగడం ముఖ్యం. ఈ మ్యాచ్లో మేం అదే చేసి గెలిచాం. టాపార్డర్కు బౌలింగ్ చేయడానికి మేం పడిన కృషి ఫలించింది. లోయరార్డర్ను టంగ్ కుప్పకూల్చాడు. ఈ సిరీస్లో గొప్ప ఆరంభం దక్కడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాను.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
371 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 21/0 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ ఇద్దరూ తొలి వికెట్కు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేసింది.