లండన్: యాషెస్ సిరీస్ను డ్రా చేసుకున్న సంతోషంలో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. టీమిండియాను పరోక్షంగా హెచ్చరించాడు. సౌతాఫ్రికా, పాకిస్థాన్,ఆస్ట్రేలియా జట్లలానే భారత్కు బజ్బాల్ రుచిచూపిస్తామని తెలిపాడు. ఆస్ట్రేలియాతో సోమవారం ముగిసిన యాషెస్ ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ఐదు టెస్ట్ల సిరీస్ 2-2తో డ్రా కావడంతో టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్గా ఆసీస్ రిటైన్ చేసుకున్నా.. నైతికంగా ఇంగ్లండ్దే విజయం. నాలుగో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయింది. సునాయసంగా గెలవాల్సిన ఆ మ్యాచ్లో వర్షం ఇంగ్లండ్ కొంపముంచింది.

ఈ క్రమంలోనే చివరి టెస్ట్ విజయాన్నంతరం ఇంగ్లండ్ టీమ్, అభిమానులు ప్రపంచకప్ గెలిచినంత సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ సిరీస్ జరుగుతున్నంత సేపు బజ్బాల్ గేమ్ గురించి తీవ్రంగా చర్చ జరిగింది. బజ్బాల్ కారణంగా ఇంగ్లండ్ కొన్ని మ్యాచ్ల్లో ఓడినా అభిమానులు మాత్రం ఈ అప్రోచ్ను తెగ ఎంజాయ్ చేశారు.
ఇక బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్గా.. బెన్ స్టోక్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 18 టెస్ట్లు ఆడిన ఇంగ్లండ్ 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
న్యూజిలాండ్తో సొంతగడ్డపై బజ్బాల్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 3-0తో ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. సౌతాఫ్రికా గడ్డపై ఇదే బజ్బాల్ గేమ్తో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపై 3-0తో గెలిచింది. తాజాగా ఆసీస్ను 2-2తో ఇబ్బంది పెట్టింది.
ఆసీస్తో చివరి టెస్ట్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్ను భారత్ వేదికగా ఇంగ్లండ్ బజ్బాల్ గేమ్ వర్కౌట్ అవుతుందా? అని ఓ మీడియా ప్రతినిధి అడగగా.. దానికి కాలమే సమాధానం చెబుతుందని అతను బదులిచ్చాడు.
'మేం న్యూజిలాండ్ను 3-0తో క్లీన్ స్వీప్ చేశాం. అప్పుడు ఇదే అప్రోచ్తో సౌతాఫ్రికాను, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలను ఓడిస్తామని అస్సలు అనుకోలేదు. భారత్పై కూడా ఇదే జోరు కొనసాగిస్తామని ఎవరికి తెలుసు. దీనికి కాలమే సమాధానం చెబుతోంది.'అని బెన్ స్టోక్స్ తెలిపాడు. పరోక్షంగా అన్నీ జట్లను ఓడించినట్లే భారత్ను కూడా బజ్బాల్తో మట్టికరిపిస్తామని స్టోక్స్ హెచ్చరించాడు.
భారత్ గడ్డపై 2012-13లో చివరిసారిగా విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెండు సార్లు 4-0, 3-1తో ఓటమిపాలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్కు హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికలను ఖరారు చేశారు. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ సిరీస్ జరగనుంది.