
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ విషయంలో బిజీగా ఉన్న భారత క్రికెట్ బోర్డు.. ఈ క్యాష్ రిచ్ లీగ్ అనంతరం ధోనీ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భారత క్రికెట్కు ఎంతో సేవ చేసిన ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు. 'ప్రస్తుతమైతే ఎలాంటి అంతర్జాతీయ సిరీస్లు లేవు. ఐపీఎల్ తర్వాత ధోనీ ఫెర్వెల్ మ్యాచ్పై ఆలోచిస్తాం. మహీ భారత క్రికెట్కు ఎంతో చేశాడు. గ్రాండ్ సెండాఫ్ అందుకోవడానికి అతను అన్ని విధాల అర్హుడు. మేం ఎప్పుడూ ధోనీ ఫేర్వెల్ మ్యాచ్తోనే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాం. కానీ అతను ఎవరూ ఊహించని విధంగా ఆటకు గుడ్బై చెప్పాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఫేర్వెల్ మ్యాచ్పై ధోనీ అభిప్రాయం అడుగుతాం. అతనికి సరైన సత్కార వేడుకను ఏర్పాటు చేసే వీడ్కోలు పలుకుతాం.'అని సదరు అధికారి తెలిపారు.
అయితే ఫేర్వెల్ మ్యాచ్కు ధోనీ అంగీకరించే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేస్తే.. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ల రిటైర్మెంట్ వ్యవహారం కూడా ప్రస్తావనకు వస్తుందని, వాళ్లు కూడా సాధా సీదాగానే ఆటకు గుడ్ చెప్పారనే వాదన వస్తుందంటున్నారు. ఈ క్రమంలోనే ధోనీ ఫేర్వెల్ మ్యాచ్కు ఒప్పుకోడని అభిప్రాయపడుతున్నారు.
భారత 74 స్వాతంత్ర్య దినోత్సవం నాడే ధోనీ ఓ ఇన్స్టా పోస్ట్తో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేశాడు. ఇక భారత్కు ఐసీసీ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలు అందించిన ధోనీ.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా ఘనత వహించాడు. అలాంటి ఆటగాడికి ఘన వీడ్కోలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.