
న్యూఢిల్లీ: చైనా వస్తు బహిష్కరణ సెగతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న విషయం తెలిసిందే. బంగారు బాతులాంటి వివో తప్పుకోవడంతో బీసీసీఐ ప్రధాన (టైటిల్) స్పాన్సర్ వేటలో పడింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది.
ఐపీఎల్-13 సీజన్ పోటీలను సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో నిర్వహించనుంది. అయితే ఈ డీల్ కాలపరిమితి (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 31) నాలుగున్నర నెలలే! బిడ్లను ఈ నెల 14 వరకు దరఖాస్తు చేయవచ్చు.
ఇతర నిబంధనలు, ఒప్పంద వివరాలు, స్పాన్సర్షిప్తో చేకూరే ప్రయోజనాలు తదితర అంశా లు తెలుసుకున్న తర్వాత ఆగస్టు 14 వరకు సదరు కంపెనీలు తుది బిడ్లు దాఖలు చేయాల్సి ఉం టుంది. స్పాన్సర్షిప్ కోసం బిడ్ వేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. అనంతరం ఆగస్టు 18న టైటిల్ స్పాన్సర్ ఎవరనే విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.
ఇక ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం 'వివో' ప్రతి ఏడాది రూ. 440 కోట్లు చెల్లించింది. 2022 వరకు మొత్తం ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీ చైనాతో వస్తు బహిష్కరణ సెగతో తమ డీల్ను రద్దు చేసుకుంది. వివో చెల్లించిన దాంతో పోలిస్తే తక్కువ మొత్తానికి కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. యోగా గురు రాందేవ్ బాబా పతంజలితో పాటు అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 తదితర కంపెనీలు కూడా స్పాన్సర్షిప్ కోసం పోటీపడుతున్నాయి.