ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పట్టు వీడటం లేదు. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించడం లేదు. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం తప్పా.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేమని స్పష్టం చేస్తోంది.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం పీసీబీ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. స్టేడియాలను పునరుద్దరించడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు పాకిస్థాన్లో పర్యటించేందుకు టీమిండియా ససేమిరా అంటుంది. భద్రతా కారణాలు చూపుతూ పాకిస్థాన్లో పర్యటించలేమని చెబుతోంది.

పట్టు వీడని భారత్, పాక్..
హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని, తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో జరపాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ జట్టును పాకిస్థాన్కు పంపించలేమని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి సమాచారమిచ్చింది. అంతేకాకుండా పాకిస్థాన్లో టీమిండియా పర్యటించేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతివ్వడం లేదు.
మరోవైపు .. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించమని పీసీబీ పట్టుదలతో ఉంది. భారత్ తమ దేశానికి రాకపోతే వారి స్థానంలో మరో జట్టుకు అవకాశం ఇవ్వాలని కూడా పీసీబీ ఐసీసీని డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీమిండియా వాదనకు ఐసీసీ కట్టుబడి ఉంటే.. ఈ టోర్నీ నుంచి తప్పుకుంటామని, న్యాయ పోరాటం చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు..?
ఈ టోర్నీ విషయంలో ఇరు దేశాలు పట్టుదలతో ఉండటంతో ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ టోర్నీనే రద్దు చేయడం లేదా, వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 'ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్య దేశంతో పాటు ఈ టోర్నీలో పాల్గొనే జట్లతో షెడ్యూల్పై చర్చలు జరుపుతున్నాం.
తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం. మరోవైపు షెడ్యూల్ కుదరకపోతే ఈ టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేస్తాం.'అని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ఈ టోర్నీ నిర్వహిణకు డ్రాఫ్ట్ షెడ్యూల్ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. భారత్ హైబ్రిడ్ మోడల్కు పట్టుబడుతుండటం.. పాకిస్థాన్ అంగీకరించకపోవడంతో ఈ టోర్నీ తుది షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
2008లో చివరిసారిగా..
భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పాల్గొంది. హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్ వేదికగా తమ మ్యాచ్లు ఆడింది.