టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోరలేదని వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. బీసీసీఐ ఒత్తిడితోనే కోహ్లీ, రోహిత్ వీడ్కోలు పలకాడని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనకు ముందే వారం రోజుల వ్యవధిలోనే ఈ దిగ్గజ ఆటగాళ్లు తప్పుకోవడం అనేక సందేహాలకు దారి తీసింది.
రిటైర్మెంట్కు ముందు మైకేల్ క్లార్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ రోహిత్ ఇంగ్లండ్ పర్యటన గురించి మాట్లాడాడు. ఈ సిరీస్కు సన్నదమవుతున్నట్లు కూడా చెప్పాడు. కానీ అంతలోనే రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ సూచనలతోనే రిటైర్మెంట్ ప్రకటించారనే అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఒత్తిడి చేసి మరి కోహ్లీ, రోహిత్ తప్పుకునేలా చేశాడని వార్తలు వచ్చాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. ఈ వార్తలను కొట్టిపారేసారు. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటించాలని ఏ ఆటగాడికి కూడా బీసీసీఐ చెప్పదు, అది బోర్డు పాలసీ కూడా కాదని స్పష్టం చేశారు.

'కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్పై మరోసారి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ, రోహిత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రిటైర్మెంట్ వారి వ్యక్తిగత నిర్ణయం. ఏ ఆటగాడికి కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ చెప్పదు. అది మా పాలసీ కూడా కాదు. అది వారి వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. రోహిత్, కోహ్లీ గొప్ప బ్యాటర్లు. వారిని మిస్సవుతూనే ఉంటాం. టెస్ట్లకు వీడ్కోలు పలికినా వన్డేలకు అందుబాటులో ఉండటం సంతోషించే విషయం. శుభ్మన్ గిల్ బ్యాటర్గా, కెప్టెన్గా రాటు దేలుతున్నాడు.'అని రాజీవ్ శుక్లా ఓ న్యూస్ ఏజెన్సీతో అన్నాడు. టీమిండియా ఆటగాళ్లతో కలిసి రాజీవ్ శుక్లా.. బ్రిటన్ కింగ్ చార్లెస్-3ని మర్యాద పూర్వకంగా కలిసారు. లండన్లోని క్లారెన్ హౌస్ గార్టెన్లో జరిగిన ఈ సమావేశంలో భారత ఆటగాళ్లతో కింగ్ చార్లెస్ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా చార్లెస్కు రాజీవ్ శుక్లా బుక్ను గిప్ట్ కూడా ఇచ్చారు.
కోహ్లీ, రోహిత్ లేకుండానే ఇంగ్లండ్ పర్యటను వెళ్లిన టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేస్తుంది. ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడినా.. రెండో టెస్ట్ గెలిచింది. మూడో టెస్ట్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం 2-1తో వెనుకంజలో ఉంది. శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్తో కోహ్లీ, రోహిత్ లోటును భర్తీ చేశారు.