టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఆటగాళ్లు కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందుకోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఫిట్నెస్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన రోహిత్ శర్మ ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ఇద్దరూ ఆటగాళ్లు సత్తా చాటారు. అయితే ఈ వన్డే సిరీస్లో టీమిండియా ఓటమిపాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. ఆఖరి వన్డేలో అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మరోవైపు తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండటంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.

'భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని కోహ్లీ, రోహిత్లకు బీసీసీఐతో పాటు టీమ్మేనేజ్మెంట్ సూచించింది. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ ఆటగాళ్లు మ్యాచ్ ఫిట్నెస్తో పాటు ప్రాక్టీస్ సాధించేందుకు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరింది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నారు. అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని గతంలోనే బీసీసీఐతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆదేశించారు.
రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతానని ముంబై జట్టుకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. అప్కమింగ్ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటానని రోహిత్ తెలిపినట్లు సమాచారం. విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ లండన్లో ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం అతను నేరుగా లండన్ వెళ్లిపోయాడు. అక్కడే సంసారం పెట్టిన కోహ్లీ.. కేవలం మ్యాచ్ల కోసం మాత్రమే భారత్కు వస్తున్నాడు.
ఈ క్రమంలోనే కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతాడా? లేక ప్రత్యేక అనుమతితో ఇంగ్లండ్ కౌంటీ వన్డే ఛాంపియన్షిప్లో బరిలోకి దిగుతాడా? అనేది సందేహంగా మారింది. అయితే దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశాలివ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ తీరు.. జట్టు నుంచి పొమ్మన లేక పొగ పెట్టినట్లు ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.