ఐపీఎల్ 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడకుండా ముస్తాఫిజుర్పై నిషేధం విధించాలని దేశవ్యాప్తండా డిమాండ్ వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
పలు రాజకీయ పార్టీలు సైతం ముస్తాఫిజుర్ను వదిలేయాలని కేకేఆర్ను బహిరంగంగా హెచ్చరించాయి. ఈ క్రమంలోనే అతన్ని జట్టు నుంచి వదిలేయాలని కేకేఆర్కు బీసీసీఐ సూచించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు, రాజకీయ ఒత్తిళ్ల మేరకు కేకేఆర్ ఫ్రాంచైజీకి ఆదేశాలు జారీ చేసినట్లు సైకియా స్పష్టం చేశారు.

ముందుగా ఈ విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబించినప్పటికీ.. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 'ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను విడుదల చేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. అతని స్థానంలో కేకేఆర్ మరో ప్రత్యామ్నాయ ఆటగాడిని కోరుకుంటే.. అందుకు బీసీసీఐ అనమతి ఇస్తుంది.'అని ఏఎన్ఐతో సైకియా అన్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కేకేఆర్ రూ.9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడి మరీ భార ధరకు దక్కించుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లా ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు. కానీ తాజా పరిణామాలతో కేకేఆర్కు తీవ్ర నష్టం జరగనుంది. ముస్తాఫిజుర్ స్థాయి ఆటగాడిని భర్తీ చేయడం కేకేఆర్కు కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టును నేడు(శనివారం) ప్రకటిస్తామని దేవజిత్ సైకియా తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం సెలెక్షన్ కమిటీ, టీమ్మేనేజ్మెంట్ సమావేశమై జట్టును ప్రకటిస్తుందని చెప్పారు. 'జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రోజు మేం సెలెక్టర్లతో మధ్యాహ్నం సమావేశం అవుతున్నాం. ఆ సమావేశం అనంతరం న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటిస్తాం.'అని సైకియా పేర్కొన్నారు.