టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్ట్లు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్కు బుమ్రా దూరంగా ఉన్నాడు. వర్క్లోడ్లో భాగంగానే అతన్ని టీమిండియా మేనేజ్మెంట్ దూరంగా ఉంచింది. అయితే బుమ్రాకు రెస్ట్ ఇవ్వడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అన్ని మ్యాచ్లు ఆడలేనప్పుడు సిరీస్లకు ఎంపిక చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బుమ్రా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటేనే బుమ్రాను జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
'స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్లు ఎప్పటికప్పుడు ఆటగాళ్ల వర్క్లోడ్పై అధ్యయనం చేస్తూనే ఉంటారు. బుమ్రా ఫిట్గా ఉండటం జట్టుకు కీలకం. వైద్య బృందం పర్యవేక్షించిన తర్వాతే అతన్ని తుది జట్టులో ఆడించడం జరుగుతుంది. అతను అన్ని మ్యాచ్లు ఆడగలడని భావిస్తేనే ఏదైనా సిరీస్కు ఎంపిక చేయాలనే ఆలోచనలో బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ ఉంది.'అని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

అయితే ఈ వార్తలను టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ఖండించాడు. ఇందులో నిజం లేదని చెప్పాడు. 'బుమ్రాపై వస్తున్నవన్నీ తప్పుడు వార్తలే. అతన్ని అన్ని మ్యాచ్ల్లోనూ ఆడించాలని అనుకుంటాం. కానీ అతని శరీరం సహకరించాలి కదా? అతని శరీరానికి గౌరవం ఇవ్వాలి. అందుకే బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ను జాగ్రత్తగా పరీక్షిస్తున్నాం. ఇష్టానుసారం ఆడుతానని బుమ్రా ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి కామెంట్స్ రావడం బాధాకరం. మూడు టెస్ట్లు మాత్రమే ఆడుతానని సిరీస్కు ముందే చెప్పాడు. ఆ మ్యాచ్లు ఏంటో మేనేజ్మెంటే నిర్ణయించాలన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకున్నాం.'అని డస్కాటే పేర్కొన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ కాలంగా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతని విలక్షణమైన బౌలింగ్ శైలి కారణంగా వెన్నుపై అదనపు భారం పడుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు జట్టుకు దూరమైన బుమ్రా.. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఈ పర్యటనలో కెప్టెన్గా జట్టు బౌలింగ్ భారాన్ని ఒక్కడే మోసాడు. ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో గాయపడిన అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు. మళ్లీ ఐపీఎల్తోనే రీఎంట్రీ ఇచ్చాడు. నాలుగో టెస్ట్లో బుమ్రా పేస్ దారుణంగా పడిపోయింది. చీల మండ గాయంతో కూడా అతను ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే అతను ఆఖరి మ్యాచ్కు దూరమయ్యాడు.