ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ పెట్టిన కండిషన్స్ను సడలించాలని టీమిండియా మేనేజ్మెంట్ చేసిన విజ్ఞప్తికి బోర్డు నిరాకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా టోర్నీ సందర్భంగా కుటుంబ సభ్యులను తమతో అనుమతించాలని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన రిక్వెస్ట్ను బీసీసీఐ తిరస్కరించింది. జట్టు ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది.
గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత బీసీసీఐ ఆటగాళ్లకు 10 కండిషన్స్తో కూడిన గైడ్లైన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా విదేశీ పర్యటనలు, సిరీస్ల సందర్భంగా ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండటాన్ని నిషేధించింది. 45 రోజుల కంటే ఎక్కువ సాగే పర్యటనల్లోనే కుటుంబ సభ్యులను కేవలం 15 రోజులకు మాత్రమే అనుమతించింది. అయితే ఆటగాళ్లు తమ సొంత ఖర్చుతో కుటుంబ సభ్యుల ప్రయాణానికి, బసకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ ఒకే హోటల్ గదిలో ఉండకూడదు.

ఆటగాళ్లందరూ తప్పనిసరిగా టీమ్ బస్సులోనే ప్రయాణించాలి. లోకల్ మ్యాచ్లు ఉన్నా కూడా సొంత వాహనాలు వాడకూడదు. ఆటగాళ్ల వ్యక్తిగత మేనేజర్లు, ఏజెంట్లు లేదా ప్రైవేట్ చెఫ్లను కూడా టీమ్ హోటల్లోకి అనుమతించరు. మ్యాచ్ల మధ్య జరిగే అనధికారిక సమావేశాలకు ఆటగాళ్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలి అనే నిబంధనలను బీసీసీఐ తీసుకొచ్చింది.
ఓ జాతీయ ఛానెల్ రిపోర్ట్ ప్రకారం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్.. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సతీమణులు, కాబోయే భార్యలను ప్రపంచకప్ సమయంలో తమతో ఉండటానికి అనుమతి కోరింది. అయితే ఈ విన్నపాన్ని బీసీసీఐ తిరస్కరించింది.
అనధికారిక జట్టు సమావేశాలకు హాజరుకాకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి చాలా మంది ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఈ నిషేధం విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. భారత జట్టు అన్ని స్వదేశీ మ్యాచ్లను ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీలో ఆడుతుంది.
పాకిస్థాన్తో జరిగే ఏకైక మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఒకవేళ నాకౌట్లో దాయాది జట్టుతో మళ్ళీ తలపడితే, డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబోకు ప్రయాణించాల్సి ఉంటుంది.