
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణపై సోమవారం(ఏప్రిల్ 13) బోర్డు ట్రెజరర్స్తో చర్చించి అప్డేట్ ఇస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు ఈ రోజు ఎలాంటి భేటీ జరగలేదని తెలుస్తోంది. ఈ కాన్ఫరెన్స్ సమావేశం బుధవారం (ఏప్రిల్ 15)కు వాయిదా పడ్డట్లు సమాచారం.
'ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగింపుపై ఎలాంటి స్పష్టత లేదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఏప్రిల్ 30కు పొడిగించాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైరస్ ప్రభావం ఏం తగ్గలేదు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ఆయన స్పీచ్ తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని మేం భావిస్తున్నాం. అప్పటి వరకు ఐపీఎల్పై చర్చించకపోవడమే మంచిందని మేం భావిస్తున్నాం'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే రెండు నెలల్లో ఈ టోర్నీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇక ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకునే సమయం ఇది కాదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ తెలిపారు. ఈ ఏడాది చివర్లో టోర్నీ నిర్వహణ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవతుందన్నారు. 'ప్రస్తుతం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో అనే అంశంపై కూడా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంతవరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఈ ఏడాది చివరి వరకు టోర్నీ జరగొచ్చని చెప్పడం తొందరపాటు అవుతుంది' అని ధూమల్ అన్నారు.