భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) లెజెండ్స్ లీగ్ నిర్వహించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహాలోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో ఓ లీగ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయంపై కొంతమంది మాజీ క్రికెటర్ల నుంచి బీసీసీఐ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ టోర్నీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలనాటి ఆటగాళ్లు మళ్లీ బ్యాట్, బంతి పట్టి తమ ఆటతో అలరిస్తుంటే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ రోడ్ సెఫ్టీ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 పేరిట జరిగిన టోర్నీలకు కూడా ప్రేక్షకాదరణ లభించింది. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెక్రటరీ జైషాను సంప్రదించి ఐపీఎల్ తరహాలో లెజెండ్స్ క్రికెట్ నిర్వహించాలని కోరినట్లు సమాచారం.
ఇప్పటికే బీసీసీఐ ఆధ్యర్యంలో నడుస్తున్న ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ సూపర్ సక్సెస్ అయ్యాయి. లెజెండ్స్ లీగ్ను కూడా సిటీ బేస్డ్ ఫ్రాంచైజీలతో నిర్వహిస్తేనే బాగుంటుందని సదరు మాజీ ప్లేయర్లు జైషాకు సూచించారట. లెజెండ్స్ లీగ్ నిర్వహణకు సంబంధించి తమకు ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.
'ఐపీఎల్ తరహాలో లెజెండ్స్ టీ20 లీగ్ నిర్వహించాలని మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నాం. లెజెండ్స్ లీగ్ నిర్వహణపై సమాలోచనలు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది.'అని సదరు అధికారి చెప్పారు.
అయితే ఈ ఏడాది నిర్వహించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐకి తగిన సమయం లేదు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది లెజెండ్స్ లీగ్ నిర్వహణ గురించి ఆలోచించే అవకాశం ఉందని మరో అధికారి అన్నాడు.