
న్యూఢిల్లీ: ఇంటర్వ్యూ కోసం టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్ట్పై కఠన చర్యలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్ వివాదంపై సమగ్ర దర్యాప్తుకు బీసీసీఐ ఆదేశించిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తూ సాహా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సైతం అతను షేర్ చేశాడు. ఇంటర్వ్యూకు అంగీకరించకపోవడంతో సదరు జర్నలిస్ట్ బెదరింపులకు దిగాడని సాహా పేర్కొన్నాడు.
'భారత క్రికెట్ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్ట్ నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది'అనే క్యాప్షన్తో సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సాహా ట్వీట్కు స్పందించిన అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనికి మద్దతు తెలిపారు. సదరు జర్నలిస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు దిగ్గజ బౌలర్లు హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిలు ట్విటర్ వేదికగా స్పందించారు. బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలోనే ఈ వివాదంపై బీసీసీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సదరు జర్నలిస్ట్ పేరు చెప్పాలని సాహాను బోర్డు పెద్దలు అడిగినట్లు కూడా సమాచారం. సదరు జర్నలిస్ట్ ఎవరో తేలితే క్రికెట్కు సంబంధించిన వార్తలు రాయకుండా, ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేయకుండా అతనిపై జీవిత కాలం నిషేధం విధిస్తామని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. అలాగే శ్రీలంక పర్యటనకు ఎంపిక కాకపోవడంపై సాహా చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు.
"సాహా ఇంటర్వ్యూలో ఏమన్నాడు. వాట్సాప్ చాట్లో ఏం ఉంది. అది ఎవరు పంపారు? అనే విషయాలను పూర్తి స్థాయిలో బీసీసీఐ దర్యాప్తు చేయనుంది. సాహా వాట్సాప్లో చేసిన వ్యాఖ్యలు ఓ జర్నలిస్టువే అని రుజువైతే ఇండియన్ క్రికెటర్లను ఇంటర్వ్యూ చేయకుండా, క్రికెట్ సంబంధించిన వార్తలు రాయకుండా అతని జీవిత కాలం నిషేధం విధిస్తాం.'అని సదరు అధికారి తెలిపారు.
వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్కు సాహాను సెలెక్టర్లు దూరం పెట్టారు ఈ నేపథ్యంలోనే సాహా టీమ్మేనేజ్మెంట్పై ఓ ఇంటర్వూలో తీవ్ర ఆరోపణలు చేశాడు. రిటైర్మెంట్కు ప్లాన్ చేసుకోవాలని కోచ్ ద్రవిడ్ సూచించాడని ఆరోపించాడు.