
న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ మార్పు భారత క్రికెట్ జట్టులో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అగ్గిరాజేసింది. తనను తప్పించి రోహిత్ శర్మకు వన్డే సారథ్యం అప్పగించడం, బోనస్గా టెస్ట్ వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై విరాట్ కోహ్లీ ఆగ్రహంగా ఉండగా.. బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం లేదని కోహ్లీపై రోహిత్ అంతే కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురపడేందుకు కూడా ఇష్టపడటం లేదని, ఒకరి కెప్టెన్సీ మరొకరు ఆడేందుకు నిరాకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుంచి జరిగే టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ తీరుపై బీసీసీఐ పెద్దలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థాయి వ్యక్తి ఇలా చేయడం తగదని అంటున్నారు. 'వన్డే కెప్టెన్గా తనను తప్పించడాన్ని విరాట్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఫ్యామిలీ రీజన్స్ పేరుతో సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. సౌతాఫ్రికా టూర్ తర్వాత ఇద్దరు కెప్టెన్లను కూర్చోబెట్టి మాట్లాడతాం. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. వన్డే కెప్టెన్ను మార్చడం అనేది జట్టు గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కోహ్లీ ఇలా చేయడం నిజంగా దురదృష్టకరం. ఈ సమస్య వల్ల జట్టులో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం ముఖ్యం. విరాట్, రోహిత్ జట్టులో బెస్ట్ ప్లేయర్లు, మూడు ఫార్మాట్స్లోనూ ముఖ్యమైన ఆటగాళ్లు, వాళ్లిద్దరూ కలిసి ఉండాలి'అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ఇక తన కూతురు వామిక ఫస్ట్ బర్త్డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతూ వన్డేలకు దూరంగా ఉంటానని, ఈ మేరకు సిరీస్ టైమ్లో తనకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐని కోహ్లీ రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక గాయంతో టెస్ట్ సిరీస్కు దూరమైనట్టు ప్రకటన వచ్చేదాకా కోహ్లీ ముంబైలో భారత టెస్ట్ టీమ్కు ఏర్పాటు చేసిన బయో బబుల్లో చేరకపోవడం కూడా అనుమానాలను పెంచుతోంది. మరోపక్క టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నిజంగానే గాయపడ్డాడా? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.
విరాట్ కోహ్లీ కూతురు వామిక పుట్టిన రోజు జనవరి 11న కాగా, అదే రోజున సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ ప్రారంభమవుతోంది. ఇది కోహ్లీకి వందో టెస్ట్ కావడం విశేషం. జనవరి 19 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవ్వనుంది. ఒకవేళ కూతురు తొలి బర్త్డే కోసం లీవ్ తీసుకోవాలని కోహ్లీ భావిస్తే.. 11కు ముందే తీసుకోవాలి. కానీ బర్త్డే అయిన వారం తర్వాత మొదలయ్యే వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకోవడం చూస్తే రోహిత్ కెప్టెన్సీలో ఆడటం తనకు ఇష్టం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న విరాట్.. సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలకు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఎవరీ ఫోన్కు విరాట్ రెస్పాండ్ అవ్వలేదని ప్రచారం జరుగుతోంది.