
న్యూఢిల్లీ: వివిధ స్థాయి క్రికెట్లో వయసు సంబంధిత మోసాలను గుర్తించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సాఫ్ట్వేర్ను వాడాలనుకుంటుంది. దీని వల్ల అతి తక్కువ సమయంలోనే వయసు మోసాలను గుర్తించవచ్చని, ఖర్చు కూడా చాలా తక్కువని బీసీసీఐ భావిస్తుంది.
ప్రస్తుతం వయసు సంబంధిత మోసాలను గుర్తించేందుకు బీసీసీఐ.. టీడబ్ల్యూ3 (ఎడమచేయి, మణికట్టు ఎక్స్రే ఆధారంగా) విధానాన్ని ఉపయోగిస్తోంది.ఈ విధానంలో ఒక్కో పరీక్షకు రూ.2400 ఖర్చవుతోంది. అంతేకాకుండా 3-4 రోజుల సమయం పడుతోంది.
దాంతోనే కొత్తగా వచ్చిన బోన్ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ వల్ల వెంటనే ఫలితం వస్తుంది. ఖర్చు కూడా 288 రూపాయలే. దాంతో ఈ సాఫ్ట్వేర్ను బీసీసీఐ ప్రయోగాత్మకంగా వాడాలని నిర్ణయించింది. కొత్తగా ఉపయోగించాలనుకుంటున్న సాప్ట్వేర్ సాంపిల్ డాటా తమను సంతృప్తి పరిచిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరిన్నీ ట్రయల్స్ చేస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న అసోసియేషన్లకు చెందిన 3800 ఎక్స్రేలతో సాఫ్ట్వేర్ను పరిశీలిస్తామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా వివిధ వయోవిభాగాల్లో ప్రస్తుతం వయసు సంబంధిత మోసాలు చాలా ఎక్కువే జరుగుతున్నాయి. వయసు తక్కువగా చూపెడుతూ తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినందుకు 2019 జూన్లో జమ్ముకశ్మీర్ పేసర్ రసిక్ ఆలమ్ రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. అసలు వయసును దాచిపెట్టినట్లు తేలిన వారిలో అండర్-19 ప్రపంచకప్ స్టార్ మంజోత్ కల్రా.. కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ బ్యాటర్ అంకిత్ బావ్నె కూడా ఉన్నారు. సీనియర్ పురుషులు, మహిళల సహా అన్ని విభాగాల్లో వయసు మోసాలకు పాల్పడ్డవారందరూ రెండేళ్ల నిషేధానికి గురయ్యారు.