న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ అభిమానులకు శుభవార్త. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న ఈ ఇద్దరూ అతి త్వరలోనే మైదానంలోకి దిగబోతున్నారు.
ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023లో ఈ ఇద్దరూ బరిలోకి దిగే అవకాశం ఉందని ఎన్సీఏ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వీరి గాయాల పురోగతిపై బీసీసీఐ, ఎన్సీఏ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

గతేడాది సెప్టెంబర్ నుంచి జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2022, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్.. ఇలా వరుసగా కీలకమైన టోర్నీలకు అతను దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో సుదీర్ఘ కాలం అతను ఆటకు దూరమయ్యాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత జరిగే ఐర్లాండ్ సిరీస్లో బుమ్రా రీఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ, వాటన్నింటినీ ఎన్సీఏ వర్గాలు కొట్టిపడేశాయి. బుమ్రా రోజూ ఏడేసి ఓవర్ల చొప్పున బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆసియా కప్ టోర్నీకి మరో నెల రోజుల సమయం ఉండటంతో ఆలోగా పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధిస్తాడనే ఆశాభావంతో ఉన్నట్లు ఎన్సీఏ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలో మోకాలి గాయం కారణంగా వైదొలిగిన కేఎల్ రాహుల్ కూడా వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా జిమ్లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను రాహుల్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ సెలెక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తోందని.. ఒకవేళ పూర్తిగా కోలుకోని పక్షంలో సంజూశాంసన్ లేదా సూర్యకుమార్ యాదవ్ను పరిశీలించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బుమ్రా రీఎంట్రీని స్వాగతిస్తున్నా కేఎల్ రాహుల్ వద్దని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అతని వల్ల టీమిండియా మూడు ప్రపంచకప్ల్లో విఫలమైందని కామెంట్ చేస్తున్నారు.