న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్ టీమ్లో టీమిండియా వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు. జూలై 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా.. ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ టీమ్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.
16 మంది సభ్యులతో కూడిన టెస్ట్ టీమ్ వివరాలను ఎస్ఎస్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్లపై వేటు వేసిన సెలెక్టర్లు.. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్లకు అవకాశం ఇచ్చారు.

వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు కట్టబెట్టారు. దాంతో చతేశ్వర్ పుజారా కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే పుజారాకు ఇప్పుడే టీమిండియా డోర్లు మూసుకుపోలేదని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నాడు.
యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ కాంబినేషన్ను ప్రయత్నించాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు సెలెక్టర్లు భావించారని, దాంతోనే పుజారాకు వెస్టిండీస్ పర్యటనలో చోటు దక్కలేదని తెలిపాడు.
'రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్కు అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు. దాంతోనే పుజారా వెస్టిండీస్ పర్యటనకు ఎంపికవ్వలేదు. ఈ విషయాన్ని పుజారాతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అతనికి టీమిండియాకు ఆడే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటితే గతంలో మాదిరి మళ్లీ పునారవృతం చేయవచ్చు.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
గతంలో శ్రీలంక పర్యటనకు కూడా ఇలానే దూరమైన పుజారా.. కౌంటీ క్రికెట్లో సత్తా చాటి మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమై మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు.