న్యూఢిల్లీ: ఐసీసీ టెస్ట్ చాంపియషిన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ వెళ్లే భారత క్రికెటర్లంతా కోవాగ్జిన్కు బదులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు డోస్లకు మధ్య వ్యత్యాసం నెలరోజులు ఉన్న నేపథ్యంలో ఈ సలహా ఇచ్చిందని సమాచారం. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తమ సొంత నగరాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది.
అయితే ఐపీఎల్ అర్దాంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో టీమిండియా వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగే ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ భారత్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిశాక దాదాపుగా నెల రోజుల సమయం ఉంటుంది. అప్పుడు ఐదు టెస్టుల కోసం కోహ్లీసేన సన్నద్ధం కానుంది.
ఇంగ్లండ్ పర్యటనకు సెలెక్టర్లు జంబో జట్టును ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్టర్లు సమర్పించింది. అయితే ఈ 35 మంది
తప్పనిసరి కోవిషీల్డ్ వేయించుకోవాలని ఆదేశించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఫస్ట్ డోస్ ఇక్కడ తీసుకొన్న ఆటగాళ్లు.. సెకండ్ డోస్ తీసుకునే సమయానికి ఇంగ్లండ్లో ఉంటారని తెలిపింది. అక్కడ కోవాగ్జిన్ దొరకదని, యూకే కంపెనీ తయారు చేసి కోవీషిల్డ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ఆటగాళ్లంతా కోవీషీల్డ్ వేయించుకోవాలని సూచించింది.
'యూకేకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోమని ఆటగాళ్లకు సలహా ఇచ్చాం. ఎందుకంటే వారు సెకండ్ డోస్ వేసుకునే సమయానికి యూకేలో ఉంటారు. కోవాగ్జిన్ తీసుకుంటే అక్కడ అది దొరకదు ఫలితం ఉండదు.'అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నాడు. ఇక క్రికెటర్ల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసే ఆలోచన బీసీసీఐకి లేదని, ఆటగాళ్లంతా తమ సొంత నగరాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రెసిడెంట్ గంగూలీ తెలిపాడు.