
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంజ్యూరి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ సినిమాను తలపిస్తుంది. కింగ్స్ పంజాబ్ ఎలెవన్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో హిట్ మ్యాన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ముంబై ఆటగాడి తొడ కండరాలు పట్టేయడంతో తదుపరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటన కోసం సోమవారం ప్రకటించిన భారత జట్లలో రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదు. అతనికి మూడు ఫార్మాట్లలో మొండిచేయ్యే ఎదురైంది.
అయితే రోహిత్ గాయం తీవ్రత గురించి తెలియజేయకుండా మూడు ఫార్మాట్లకు పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదేదో కుట్ర అనే చర్చ ఊపందుకుంది. గాయపడ్డ మయాంక్ అగర్వాల్, నవ్దీప్ సైనీలకు అవకాశం కల్పించి రోహిత్ పక్కన పెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, నెట్స్లో ప్రాక్టీస్ కూడా చేశాడని ఓ వీడియోను షేర్ చేసింది. దాంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీతో ఉన్న విభేదాల కారణంగానే హిట్మ్యాన్ను పక్కనపెట్టారనే ప్రచారం కూడా మొదలుపెట్టారు.
అయితే రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఫేక్ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలపడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అతని గాయం తీవ్రత ఎక్కువని, ఆ విషయాన్ని ముంబై ఇండియన్స్ దాస్తుందని సదరు అధికారి తెలిపాడని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. 'మేం మొదట్లో అనుకున్నదాని కంటే రోహిత్ శర్మ గాయం తీవ్రమైంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ షేర్ చేసిన రోహిత్ ప్రాక్టీస్ వీడియో నిజం కాకపోవచ్చు. ఆ వీడియో రోహిత్ గాయం తీవ్రత తెలియడం లేదు'అని తెలిపాడు.
మాములుగా గ్రేడ్ 1 హామ్స్ట్రింగ్ టియర్ అయితే కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుంది. అదే గ్రేడ్ 2 అయితే మాత్రం 8 వారాల సమయం అవసరం. మాములు నొప్పి అయితే వారం, 10 రోజుల్లో నయం అవుతుంది. అయితే రోహిత్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. అటు ముంబై ఇండియన్స్, ఇటు బీసీసీఐ హిట్ మ్యాన్ గాయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. తాజా సమాచారం ప్రకారం బుధవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్కు రోహిత్ దూరమయ్యే అవకాశం ఉంది.