
న్యూఢిల్లీ: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. కీలక టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సీరియస్ గాయంతో టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పితో బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో బుమ్రా ఆడని విషయం తెలిసిందే. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో అతను వెన్ను నొప్పి వస్తుందని ఫిజియోలకు చెప్పడంతో ఈ మ్యాచ్కు దూరంగా ఉంచినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.
మ్యాచ్ అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినప్పటికీ.. సుమారు 4-6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాంతోనే అతను త్రివేండ్రం నుంచి గౌహతికి వెళ్లలేదని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలపగా.. బీసీసీఐ ధృవీకరించాల్సి ఉంది.
జులైలో ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. వెస్టిండీస్ సిరీస్కు విశ్రాంతి తీసుకున్నాడు. వన్డేలతో పాటు టీ20ల్లో కూడా బుమ్రా ఆడలేదు. ఆ తర్వాత భారత్ ద్వితియశ్రేణి జట్టు.. జింబాబ్వేలో కూడా పర్యటించింది. ఆ సిరీస్ లో కూడా బుమ్రా ఆడ లేదు. ఆసియాకప్ ముంగిట వెన్ను నొప్పితో దూరమయ్యాడు.
ఆసీస్తో పర్యటనకు ముందే బుమ్రాతో పాటు హర్షల్ పటేల్కు ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్లో పాసైనట్లు కూడా పేర్కొన్నారు. దాంతోనే టీ20 ప్రపంచకప్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు ఎంపిక చేశారు. అయితే ఆసీస్తో తొలి మ్యాచ్లో కూడా బుమ్రా ఆడలేదు. అప్పుడే అతని ఫిట్నెస్పై సందేహాలు నెలకొన్నాయి.
ఇప్పటికే రవీంద్ర జడేజా సేవలను కోల్పోయిన టీమిండియాకు బుమ్రా కూడా దూరమవడం కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఆసీస్ కండిషన్స్ బుమ్రా బౌలింగ్కు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలోనే బుమ్రాను తీసుకొచ్చేందుకు బీసీసీఐ అత్యుత్సాహం చూపించినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ట్ టెస్ట్ క్లియర్ చేసిన బుమ్రా.. మళ్లీ గాయపడటంతో ఎన్సీఏ ప్రమాణాలపై కూడా సందేహాలు కలుగుతున్నాయి. గతంలో దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ సైతం ఇలానే గాయం నుంచి కోలుకున్న వెంటనే గాయపడ్డారు. ఇక బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.