న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల టీ20 భవితవ్యాన్ని కొత్తగా వచ్చే చీఫ్ సెలెక్టరే నిర్ణయిస్తాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ ఇద్దరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఇతర సీనియర్ ఆటగాళ్ల కెరీర్పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెప్పాడు.
బీసీసీఐ అంతర్గత విషయాలు వెల్లడించి చీఫ్ సెలెక్టర్ పదవి కోల్పోయిన చేతన్ శర్మ స్థానంలో కొత్త సెలెక్టర్ను నియమించేందుకు బీసీసీఐ దరఖాస్తులు నిర్వహించింది. ఈ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ దరఖాస్తు చేసుకోగా.. అతనికే చీఫ్ సెలెక్టర్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతను ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.

ఇక టీమిండియా ట్రాన్సిషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వయసు పైబడుతుండటంతో ఈ ఇద్దరి టీ20 భవితవ్యంపై అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ ఇద్దరి టీ20 భవితవ్యంపై కొత్త చీఫ్ సెలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడని ఓ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్కు తెలిపింది. 'భవిష్యత్ ప్రణాళికల గురించి ఆటగాళ్లతో చర్చించడం చీఫ్ సెలెక్టర్ బాధ్యతల్లో ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుకు అతీతులు కారు. వాళ్లు కోరుకుంటే సుదీర్ఘ కాలం పాటు జట్టులో ఉండవచ్చు.
అయితే ఎంతటి గొప్ప ఆటగాళ్లు అయినా సరే సమయం వచ్చినప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. టీమిండియాకు మూడు ఫార్మాట్లు ఆడటంతో పాటు ఐపీఎల్ కూడా ఆడటం అంత సులువైన పని కాదు'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021 ఓటమి తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగుతున్నాడు. ఆసియా కప్ 2022లో అఫ్గాన్పై సెంచరీతో ఫామ్లోకి వచ్చిన కోహ్లీ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లోనూ సత్తా చాటాడు. ఐపీఎల్లోనూ అదే జోరును కొనసాగించాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

ఇప్పటికే టీ20ల్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లతో టీ20 ప్రపంచకప్ 2024కు సిద్దం చేస్తోంది.