
కొలంబో: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు(బుధవారం) 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే ఇదే రోజు మరో భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ కూడా 21వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పడిక్కల్.. జట్టు సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. అయితే కేక్ కట్టింగ్ సందర్భంగా పడిక్కల్ చేసిన పని అభిమానుల మనసులను గెలుచుకుంది. కేక్ కట్ చేయబోయే ముందు అతను ధోనీకి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. అంతేకాకుండా మహీ భాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ కేక్ కట్ చేస్తున్నానని, అతను ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడని తెలిపాడు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో సహచర ఆటగాళ్లంతా పడిక్కల్కు బర్త్డే విషెస్ చెబుతుండగా.. కేక్ కట్ చేయడానికి వచ్చిన అతను.. మాత్రం వారిని వారించి మరి ధోనీకి విషెస్ తెలియజేశాడు. 'ఈ కేక్ కట్ చేసేముందు నేను ధోనీ భాయ్కు జట్టు తరఫున బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నాను. మా అందరికి అతను స్పూర్తి దాయకం. అంతటి దిగ్గజంతో బర్త్ డే షేర్ చేసుకోవడం గొప్ప అనూభూతి. హ్యాపీ బర్త్డే మహీ భాయ్'అని పడిక్కల్ పేర్కొన్నాడు.
ఇక రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణ.. శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జులై 13న తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా.. ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్లతో సిద్దమవుతోంది. ఇప్పటికే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ను పూర్తి చేసిన ఆటగాళ్లు.. నేడు రెండో మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్కు సంబంధించిన ఫొటోలను కూడా బీసీసీఐ షేర్ చేసింది.
ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.