
హమిల్టన్ : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న యువ భారత జట్టుకు కోహ్లీసేన మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్కు ముందు ట్విటర్ వేదికగా యువ ఆటగాళ్లకు విషెస్ తెలిపారు. ఇక విజయాన్ని కాంక్షిస్తూ కోహ్లీ సేన సాధారణ ప్రేక్షకుల్లా ఫైనల్ మ్యాచ్ను టీవీలో చూశారు. టీమిండియా మ్యాచ్ చూస్తున్న ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. చీర్స్ అనిపేర్కొంటూ, అండర్-19, టీమిండియా, అండర్19 క్రికెట్ వరల్డ్కప్ హ్యాష్ట్యాగ్లను జత చేసింది. బీసీసీఐ ఇలా పోస్టు చేయగానే.. ఈ ట్వీట్ వైరలైంది. ఈ ఫొటోలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఆటగాళ్లు మ్యాచ్ చూస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యువ భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. తన ఫామ్ను కొనసాగిస్తూ ఓపెనర్ యశస్వి జైస్వాల్(88) మరో హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(38), ప్రియమ్ గార్గ్(22) మినహా మిగతా బ్యాట్స్మన్ సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు.
అంతకుముందు భారత కుర్రాళ్లు విజయం సాధించాలని టీమిండియా కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో బాగా ఆడాలని, ఈ మ్యాచ్ను కచ్చితంగా చూస్తామని కోహ్లీ తెలిపాడు. మరోవైపు తుదిపోరులో గెలుపొందాలని శాస్త్రి కూడా ఆకాంక్షించాడు. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తోపాటు ప్రముఖ క్రికెటర్లు భారత జట్టు విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.