
ప్రధాన ఎజెండా ఐపీఎల్ షెడ్యూల్..
టీ 20 ప్రపంచప్ ఆతిథ్యంతో పాటు గతేడాది రంజీ ట్రోఫీ సీజన్ రద్దవ్వడంతో డొమెస్టిక్ ప్లేయర్లకు పరిహారం ఎలా ఇవ్వాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. ముంబై నుంచి ఈ మీటింగ్ను వర్చువల్గా కండక్ట్ చేయనున్నాడు. 'ప్రస్తుతం మాకున్న ప్రధాన అజెండా ఐపీఎల్ షెడ్యూల్. రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున పది రోజులు, ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ జరిపి మిగిలిన నాలుగు ప్లే ఆఫ్లను కూడా వారాంతంలో నిర్వహిస్తే మేం అనుకున్న తేదీల్లో లెక్క సరిపోతుంది. ఇప్పుడు కావాల్సింది దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడమే' అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

విదేశీ ఆటగాళ్ల గురించి..
సెప్టెంబర్, అక్టోబర్ విండోలో చాలా దేశాలు ఇంటర్నేషనల్ సిరీస్లో బిజీగా ఉండనున్నాయి. దీంతో ఫారిన్ ప్లేయర్ను ఎలా రప్పించాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది. లాజిస్టిక్ అంశాలతో పాటు బబుల్ టు బబుల్ ట్రాన్స్ఫర్ గురించి కూడా మాట్లాడొచ్చు. ఐపీఎల్ కంటే నేషనల్ డ్యూటీయే తమకు ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో దాదా, సెక్రటరీ జైషా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. బట్లర్, స్టోక్స్, ఆర్చర్, బెయిర్స్టో, సామ్ కరన్, మోర్గాన్, మొయిన్ అలీ, తమ ఫ్రాంచైజీల్లో ప్రధాన ప్లేయర్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లను రీప్లేస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి కచ్చితంగా ఈసీబీని ఏదో రకంగా ఒప్పించాలని బీసీసీఐ భావిస్తోంది..

టీ20 వరల్డ్కప్పై వేచి చూడండి...
ఎస్జీఎంలో మరో ప్రధానాంశం టీ20 వరల్డ్ కప్ నిర్వహణ. అక్టోబర్-నవంబర్ మధ్య ఈ టోర్నీ భారత్లో జరగాల్సి ఉండగా మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందంటున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. అయితే దీనిని మరో దేశానికి తరలించే విషయంలో తొందరపాటు ప్రదర్శించవద్దని, తగినంత సమయం ఉంది కాబట్టి కొన్నాళ్లు ఆగి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఐసీసీని ఈ సమావేశం ద్వారా బీసీసీఐ కోరనుంది. మరోవైపు ఎనిమిది జట్లతో ఐపీఎల్ నిర్వహించలేని స్థితి ఉండగా, 16 జట్లతో ప్రపంచకప్ ఎలా జరుపుతారనే దానిపై కూడా చర్చ సాగవచ్చు. వీటితో పాటు రంజీ ట్రోఫీ రద్దు కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సుమారు 700 మంది దేశవాళీ క్రికెటర్లకు ఎలా నష్టపరిహారం అందించాలనే అంశాన్ని కూడా ఎస్జీఎం అజెండాలో చేర్చారు.


Click it and Unblock the Notifications
