
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్కు రంగం సిద్దమైంది. వచ్చే ఏడాది మార్చిలో మహిళల ధనాధన్ లీగ్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. లీగ్ విధి విధానాలు, వేదికలను ఖారారు చేయడంపై బీసీసీఐ దృష్టి సారించింది. ప్రముఖ వెబ్సైట్ క్రిక్ బజ్ కథనం ప్రకారం.. ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ జరగనుంది.
మొత్తం 20 మ్యాచ్లు జరగనుండగా.. ఒక్కో టీమ్ మిగతా జట్లతో రెండేసి మ్యాచ్లను ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకొన్న జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీమ్లు ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా సెకండ్ ఫైనలిస్ట్ తేలుతుంది. ప్రతి ఫ్రాంచైజీ తుది జట్టులో ఐదుగురికి మించి విదేశీ ప్లేయర్లు ఉండకూడదు. ఇక మహిళల ఐపీఎల్కు సంబంధించి వివరాలను ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
'జట్టులో దేశీయ, విదేశీ క్రికెటర్లు సమతూకంగా ఉండాలి. ఐదు జట్లతో మహిళలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి జట్టులో 18 మంది ప్లేయర్లు ఉండాలి. అందులో ఆరుగురికి మించి విదేశీ క్రికెటర్లు ఉండకూడదు. అలాగే తుది జట్టులో మాత్రం ఐదుగురికి మించి ఓవర్సీస్ ప్లేయర్లు ఉండకూడదు. అందులో నలుగురు ఐసీసీ మెంబర్షిప్ కలిగిన దేశానికి చెందినవారు కాగా.. మరొకరు అసోసియేట్ మెంబర్గా ఉండొచ్చు.'అని సదరు అధికారి వెల్లడించాడు.
బిగ్బాష్, ది హండ్రెడ్ టోర్నమెంట్లలో కేవలం ముగ్గురు విదేశీ క్రికెటర్లను మాత్రమే అనుమతించడం గమనార్హం. దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 9- 26వ తేదీ వరకు జరిగే టీ 20 ప్రపంచకప్ ముగిశాక మహిళల ఐపీఎల్ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి ఎడిషన్లో ఒక వేదికపై 10 మ్యాచ్లు, మరో వేదికపై 10 మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫ్రాంచైజీల అమ్మకాలు, టెండరింగ్ ప్రక్రియపై ఫోకస్ పెట్టింది.