ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ చివరి దశకు చేరిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అప్కమింగ్ సౌతాఫ్రికాతో జరిగే సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఇప్పటి వరకూ 12 మ్యాచ్లు ఆడి కేవలం 216 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్ల్లో అతను గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతని కెరీర్ చివరి దశకు చేరిందనే ప్రచారం ఊపందుకుంది.
అయితే విరాట్ కోహ్లీపై వేటు గురించి వస్తున్న రూమర్స్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు స్పందించారు. విరాట్ కోహ్లీ అనుమతి లేకుండా అతన్ని టీమ్ నుంచి తప్పించమని స్పష్టం చేశాడు. 'ప్రతీ క్రికెటర్కు కెరీర్లో ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. కోహ్లీ కూడా ఇప్పుడు ఆ దశలోనే ఉన్నాడు. కానీ.. తప్పకుండా పేలవ ఫామ్ను అతను అధిగమిస్తాడు. అయితే.. ఒక సెలెక్టర్గా మేం.. జట్టు గురించి ఆలోచిస్తాం. మా మొదటి ప్రాధాన్యత కూడా జట్టే. అయితే.. టీమ్ సెలక్షన్కు ముందు విరాట్ కోహ్లీతో మేము ఒకసారి మాట్లాడతాం. ఒకవేళ అతను బ్రేక్ తీసుకోవాలని అనుకుంటే? తీసుకోవచ్చు. అలాకాకుండా ఫామ్ కోసం ఫైట్ చేస్తానన్న అతనికి అవకాశం ఇస్తాం''అని సదరు సెలెక్టర్ స్పష్టం చేశాడు.
ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్కప్ కూడా జరగనుండటంతో.. విరాట్ కోహ్లీ ఫామ్పై టీమిండియాలోనూ ఆందోళన మొదలైంది. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటర్గా రాణిస్తాడని భావించిన కోహ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది.