రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు ఆ ఫ్రాంచైజీ అత్యుత్సాహమే ప్రధాన కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ దేవ్జిత్ సైకియా అన్నారు. కాస్త సమయం తీసుకొని వేడుకలు నిర్వహించి ఉంటే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకునేది కాదని అభిప్రాయపడ్డారు. తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రాణ నష్టం తప్పేదన్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ.. 18 ఏళ్లుగా ఊరిస్తున్న టైటిల్ను అందుకుంది. దాంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు.. తమ అభిమాన జట్టు విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఆర్సీబీ సైతం బెంగళూరు వేదికగా విజయోత్స వేడుకలను నిర్వహించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ పిలుపుతో విజయోత్సవ సంబరాలకు అభిమానులు లక్షల్లో తరలివచ్చారు. దాంతో బెంగళూరు మొత్తం ఎరుపుమయంగా మారింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగా చిన్నస్వామి స్టేడియం ముందు భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ కూడా ఉంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆర్సీబీ తొందరపాటు వల్లే
ఈ సంఘటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా.. ఇలాంటి ఘటనలను మౌనంగా చూస్తూ ఉండలేమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వేడుకల నిర్వహణ విషయంలో మార్గదర్శకాల జారీకి ఆలోచన చేస్తున్నామని చెప్పారు. 'ఆర్సీబీ ఫ్రాంచైజీ తొందరపాటు కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. కాస్త సమయం తీసుకొని వేడుకలు చేసుకుంటే ప్రాణ నష్టం తప్పేది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే వేడుకలను మేం పకడ్బందీగా నిర్వహిస్తాం. కాస్త సమయం తీసుకుంటాం.
టీ20 ప్రపంచకప్ విజయానంతరం ముంబైలో విక్టరీ పరేడ్కు కాస్త సమయం తీసుకున్నాం. బెంగళూరులో కూడా అదే చేయాల్సింది. బెంగళూరు జరిగింది దురదృష్టకర ఘటన. ఇది ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం. కానీ మేం మౌనంగా చూస్తూ ఉండలేం. ఈ దేశంలో క్రికెట్ సంబంధిత వ్యవహరాలకు మేం బాధ్యత తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం.'అని సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు.
ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్పై కేసులు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసెలెతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్లను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్ణాట ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషన్ బి దయానంద్ను సస్పెండ్ చేసింది. సీఎం సిద్దరమయ్య పొలిటికల్ సెక్రటరీ కూడా విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది.