భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో బుధవారం జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో అధ్యక్షుడిగా జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన నాయకత్వంలో ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ది చెందిందని ఏసీసీ సభ్యులు మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు.
ఏసీసీ ప్రెసిడెంట్గా జై షా హయాంలో టీ20, వన్డే ప్రపంచకప్లతో పాటు ఆసియాకప్ను దిగ్విజయంగా పూర్తయ్యాయి. భారత్, పాకిస్థాన్ దేశాల నుంచే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ప్రతిభ కలిగిన ఎంతోమంది కుర్రాళ్లు ప్రపంచానికి పరిచయమయ్యారు. బ్రాడ్కాస్ట్, కమర్షియల్ డీల్స్ ద్వారా ఏసీసీ ఆదాయాన్ని పెంచడంలో జై షా సూపర్ సక్సెస్ అయ్యారు.

ఓమన్, నేపాల్ వంటి దేశాల్లోనూ క్రికెట్ అభివృద్దికి జైషా కృషి చేశారని ఏసీసీ బోర్డు సభ్యులు కొనియాడారు. జై షా ఏసీసీని పూర్తిగా మార్చేసారని, ఆయనతో కలిసి పని చేసే అవకాశం దక్కడం తమ అదృష్టమని ఒమన్ క్రికెట్ ఛైర్మన్, ఏసీసీ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ ఖిమ్జీ తెలిపారు. వరుసగా మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన జై షాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
దిగ్గజ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధికారులు, పలువురు ఆటగాళ్లు, అభిమానులు జై షాకు అభినందనలు తెలుపుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హుస్సెన్ సైతం జై షాకు అభినందనలు తెలపడంతో పాటు ప్రశంసల జల్లు కురిపించారు. ఆసియాలోని అన్ని దేశాల్లోకి క్రికెట్ను విస్తరిస్తామని జై షా తెలిపారు.
ఏసీసీ ప్రెసిడెంట్గా జై షా మూడో సారి ఎన్నికవ్వడంతో ఆయన ఐసీసీ ఛైర్మెన్ పదవికి పోటీ పడనున్నాడనే వార్తలు అవాస్తవమని తేలింది. ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ ఎన్నికలు జరగనుండగా.. జై షా చైర్మన్ పదవిపై కన్నేసాడని జాతీయ మీడియా పేర్కొంది. ఒకవేళ ఆయన ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైతే ఏసీసీ అధ్యక్ష పదవితో పాటు బీసీసీఐ సెక్రటరీ పదవి వదులుకోవాల్సి ఉంటుంది. కానీ బీసీసీఐని వదిలి జై షా వెళ్లే అవకాశం లేదు.