
రెండు జట్లు పాల్గొంటాయి..
తాజాగా ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే మరికొద్ది రోజుల్లో విశ్వక్రీడల్లో క్రికెట్ చూస్తామని వెల్లడించారు. ఐసీసీతో కలిసి బీసీసీఐ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇక ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో ఐసీసీ చర్చలు జరిపింది. కానీ, అప్పుడు బీసీసీఐ దీనికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టత ఇచ్చారు. క్రికెట్ విశ్వక్రీడల్లో భాగమైతే భారత్ పాల్గొంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఐసీసీతో కలిసి సాగుతామని పేర్కొన్నారు.

8 టీమ్లతో...
'టోక్యో ఒలింపిక్స్లో భారత బృందం ప్రదర్శనపై బీసీసీఐ సంతోషంగా ఉంది. దీంతో బీసీసీఐ తన వైఖరిని మార్చుకుంది. విశ్వక్రీడల్లో క్రికెట్ భాగమైతే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. భారత్కు మరిన్ని పతకాలు రావడానికి కృషి చేయాలని బోర్డు భావిస్తున్నట్లు'ఆ అధికారి ఒకరు తెలిపారు. భారత పురుష, మహిళల జట్లు పాల్గొంటాయన్నారు. .లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. ప్రస్తుతమైతే టీ20 మ్యాచ్లు నాలుగు గంటల్లో ముగుస్తున్నాయి. 2028 వరకు వీలైతే ఒలింపిక్స్ కోసం టీ10 తరహాలో అతి చిన్న ఫార్మాట్ను కూడా సృష్టించొచ్చు.

గతంలో ఏకైక మ్యాచ్..
1900 పారిస్ ఒలింపిక్స్లో ఏకైక క్రికెట్ మ్యాచ్ను నిర్వహించారు. ఈ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్-ఫ్రాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రెండు హాఫ్ సెంచరీలు, రెండు ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి నాలుగు ఇన్నింగ్స్ల్లో కేవలం 366 రన్సే చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో 12 మంది చొప్పున 24 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. అందులో 22 మందికి గతంలో తమ దేశాల తరఫున, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. కేవలం ఇద్దరు మాత్రమే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్ టీమ్కు రజతం దక్కింది. అయితే 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్కు కనీసం ఫస్ట్ క్లాస్ హోదా కూడా ఇవ్వలేదు.

అందుకే ఒలింపిక్స్లో క్రికెట్ లేదు
1900 ఒలింపిక్స్ తర్వాత సమ్మర్ గేమ్స్ నుంచి క్రికెట్ను తొలగించారు. విశ్వక్రీడల్లో ఆదిపత్యం చెలాయించే అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు.. ఈ ఆటపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అలానే ఓ క్రికెట్ మ్యాచ్ కోసం దాదాపు 4-5 గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడం ఈ ఆటను విస్మరించడానికి కారణంగా కనిపిస్తోంది. ఒలింపిక్స్ ఆతిథ్య దేశాల్లో చాలావరకు క్రికెట్ స్టేడియాలు ఉండవు. ప్రత్యేకించి దీని కోసమే స్టేడియాలు నిర్మించి, వాటిని నిర్వహించడం వల్ల ఆతిథ్య దేశాలకు ఆర్థిక భారం పెరగొచ్చు. ఇక క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తక్కువగా ఉండటం కూడా విశ్వక్రీడల్లో చోటు దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ కారణాల వల్లనే ఒలింపిక్స్లో క్రికెట్ను పెట్టాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారు.


Click it and Unblock the Notifications












