
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సీజన్ రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ జైషా ఓ ప్రకటనను విడుదల చేశాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ఈ ఏడాది రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని తెలిపాడు. మొదటి ఫేజ్లో అన్ని లీగ్ మ్యాచ్లను నిర్వహిస్తామని, నాకౌట్ మ్యాచ్లను జూన్లో ఆడిస్తామన్నాడు.
షెడ్యూల్ ప్రకారం జనవరి 13నే ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ ప్రారంభం కావాల్సింది. అయితే కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ కూడా రంజీట్రోఫీ నిర్వహణపై అప్డేట్ ఇచ్చాడు.'వీలైనంత త్వరగా రంజీ ట్రోఫీని నిర్వహించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.
ముందుగా లీగ్ దశను నిర్వహించి.. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మిగిలిన టోర్నీని నిర్వహించాలనే ఆలోచన ఉంది. రాబోయే రెండు నెలల్లో వాతావరణం, ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లాంటి కారణాలను భేరీజు వేసుకుని టోర్నీపై ఒక అంచనాకు వస్తాం'' అని ధూమల్ చెప్పాడు. ఈ ఇద్దరి ప్రకటనల నేపథ్యంలో వచ్చే నెలలో ఈ టోర్నీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.