టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లావుగా ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఘాటుగా స్పందించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు. ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడుతూ.. శమా మహమ్మద్ తీరును తప్పుబట్టారు.
'టీమిండియా కీలకమైన ఐసీసీ టోర్నీ మధ్యలో ఉంది. ఆ సమయంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి నుంచి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. అవి ఆటగాడి వ్యక్తిగత విమర్శలు అయినా.. జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పబ్లిసిటీ కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి'అని సైకియా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ ఫిట్గా లేడంటూ శమా మహమ్మద్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు. అతను బరువు తగ్గాల్సిన అవసరం ఉంది'అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. శమా మహమ్మద్పై క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీపై జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్కు దిగారు. ఇంత జరిగినా.. శమా మహమ్మద్ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం.
ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడుతూ.. అవి బాడీ షేమింగ్ కామెంట్స్ కావని, క్రీడాకారుడు ఫిట్గా ఉండాలనే తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని సమర్థించుకున్నారు. రోహిత్ శర్మ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నట్లు తనకు అనిపించిందని, ఆ విషయమే ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు. తనపై అకారణంగా విమర్శలు చేస్తున్నారని, తాను ఇతర కెప్టెన్లతో పోల్చుతూ ట్వీట్ చేశానని, ఆ హక్కు తనకు ఉందని, ఇది ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొచ్చారు.
ఈ పోస్ట్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలకు దారి తీసింది. క్రికెట్ ప్రేమికులు కూడా ఆగ్రహానికి గురవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ పోస్ట్ను కూడా తొలగించాలని శమాను ఆదేశించింది.