
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ను కరోనా కమ్మేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడదల చేసింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
'లీగ్ సందర్భంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ 2021 సీజన్ రద్దు చేయడమే ఉత్తమమని నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది భద్రతా విషయంలో బీసీసీఐ ఏ మాత్రం రాజీపడదు. లీగ్లో పాల్గొనే అందరి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కొంత ఆహ్లాదాన్ని అందించడానికి ప్రయత్నించాం. కానీ ప్రస్తుతం ఈ టోర్నీని నిలిపేయడంతో పాటు ఆటగాళ్లంతా వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లడం చాలా ముఖ్యం. ఐపీఎల్ 2021లో భాగమైన వారందరినీ సురక్షితంగా వారి ఇళ్లకు తరలించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇలా కఠిన పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ 2021 కోసం అహర్నీషులు కష్టపడ్డ మెడికల్ స్టాఫ్, రాష్ట్ర అసోసియేషన్లు, ప్లేయర్స్, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, భాగస్వాములందరికీ బీసీసీఐ కృతజ్ఞలు తెలయజేస్తోంది'అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇక నిన్న కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తీ, సందీప్ వారియర్, సీఎస్కే కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ డ్రైవర్ కరోనా బారిన పడగా.. నేడు సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు పాజిటీవ్ వచ్చింది. దాంతో ఆయా జట్లన్నీ ఐసోలేషన్లోకి వెళ్లాయి. మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారడంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ సీజన్ టోర్నమెంట్ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం నిర్ధారించట్లేదు. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత.. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడే ఈ టోర్నమెంట్ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాలు వెలువడుతున్నాయి. అయినా అంతర్జాతీయ క్రికెట్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ సీజన్ సాధ్యం కాకపోవచ్చు.