
ముంబై: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా ఇది అమలులో ఉంటుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్డౌన్ను మే3 వరకు పొడిగించడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
'కరోనా కట్టడికి భారత ప్రభుత్వం విధించిన లౌక్డౌన్ను పొడిగించడంతో పాటు ప్రపంచ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ 2020 సీజన్ను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ పరిధిలోని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇది అమలులో ఉంటుంది. ఆరోగ్యం, దేశ భద్రత.. క్రీడల కన్నా ముఖ్యమని బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లు, బ్రాడ్కాస్టర్స్, స్పాన్సర్స్, వాటాదారులు భావించారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాతే ఐపీఎల్ 2020 సీజన్ జరపాలనే ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.'అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇక వాస్తవానికి ఈ నిరవధిక వాయిదా విషయం బుధవారమే తెలిసింది. ఈ వ్యవహారంపై బీసీసీఐ ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లతో చర్చిస్తుండగానే ఈ వార్త లీకైంది.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ తొలుత ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అదుపులోకి రాకపోవడం.. దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో భారత ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ పొడిగించింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ 13 సీజన్ను నిరవధికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.