ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టాఫ్లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్, తెలుగు తేజం టీ దిలీప్లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. కోచ్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది.
ఇప్పటికే జట్టులో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఉండటతో అభిషేక్ నాయర్ అవసరం జట్టుకు లేదనే భావనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్య జట్టు పతనాన్ని శాసించింది. ఈ సిరీస్ను భారత్ 1-3తో కోల్పోవడంతో.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ చేజారింది.
ఈ క్రమంలోనే ఈ సిరీస్కు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించిన అభిషేక్ నాయర్కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ స్థానంలో మరో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కటే బాధ్యతలు చేపడుతాడని ప్రచారం జరుగుతోంది. అయితే కోచ్ల మార్పు విషయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

2024 టీ20 ప్రపంచకప్ విజయంతో రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. సపోర్ట్ స్టాఫ్ విషయంలో గంభీర్కు బీసీసీఐ పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే గంభీర్.. కేకేఆర్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నీ మోర్కెల్లను సపోర్ట్ స్టాఫ్లోకి తీసుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్గా టీ దిలీప్ను కొనసాగించాడు.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ను కోల్పోయింది. ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈ విజయంతో గంభీర్కు ఉపశమనం లభించింది. అయినా కోచింగ్ స్టాఫ్ సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ సంఖ్యను కుదించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ దిలీప్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ చాలా మెరుగైంది. అయినా అతన్ని ఎందుకు తప్పిస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో టీమిండియా ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది.