
న్యూఢిల్లీ: కొంతమంది జూనియర్ క్రికెటర్లకు సకాలంలో అవార్డుల ప్రైజ్మనీని చెల్లించలేకపోయామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెల్లడించింది. జన్ధన్ అకౌంట్ల కారణంగా డబ్బు డిపాజిట్లలో సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పింది. 'కొంతమంది జూనియర్ క్రికెటర్లు బీసీసీఐ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. వాళ్లకు రూ.1.5 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సి ఉంది. అందరికి చెల్లించినా ఆరుగురికి మాత్రం ఇవ్వలేకపోయాం. సీనియర్ క్రికెటర్లందరికీ జనవరి 11నే డబ్బులు పడిపోయాయి. జూనియర్లకు పడలేదు. చాలా సార్లు ట్రాన్స్ఫర్ చేసి విఫలమయ్యాం. సమస్యను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లవి జన్ధన్ అకౌంట్స్ కావడంతో డిపాజిట్ పరిమితి రూ.50 వేల వరకు ఉందని చెప్పారు.
అందుకే లక్షన్నర డిపాజిట్ను తీసుకోలేదు.'అని బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్ ఒకరు వెల్లడించారు. చివరకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో మాట్లాడి జన్ధన్ అకౌంట్లను సేవింగ్ ఖాతాల కిందకు మార్చి డబ్బులు చెల్లించామన్నారు. 'వాస్తవానికి జూనియర్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు చాలా తర్కువగా ఉంటాయి. అండర్-16కు రూ.10వేలు, డీఏ రూ.2500, అండర్-19 వారికి రూ.40 వేలు, డీఏ 10వేలు చెల్లిస్తాం. అందుకే నార్మల్ టైమ్లో ఈ డబ్బులను ట్రాన్స్ ఫర్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు అమౌంట్ పెద్దది కావడంతో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రంజీ ప్లేయర్లకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంది'అని సదరు అధికారి తెలిపారు.