
న్యూఢిల్లీ: ముందస్తు చర్యల్లో భాగంగానే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి తప్పించామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. బుమ్రా బౌలింగ్ పునరుద్దరణకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది.
'శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. దాంతో తొలి వన్డే జరగనున్న గువహతికి అతను చేరుకోలేదు. అతని బౌలింగ్ పునరుద్దరణకు ఇంకాస్త సమయం పడుతోంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మరే ఆటగాడిని ఆలిండియా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో రాసుకొచ్చింది. గువహతి వేదికగా మంగళవారం భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటి ఇరు జట్లు గువహతి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.
వాస్తవానికి శ్రీలంకతో ముందుగా ఎంపిక చేసిన జట్టులో బుమ్రా లేడు. అతను పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఆలిండియా సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. బీసీసీఐ సైతం బుమ్రా ఎంపికపై జనవరి 3న అధికారిక ప్రకటన చేసింది. 'శ్రీలంకతో వన్డే సిరీస్కు ఆలిండియా సెలెక్షన్ కమిటీ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది'అని పేర్కొంది.
గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. సమీప భవిష్యత్తులో కీలక సిరీస్లు (ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, వన్డే వరల్డ్కప్) ఆడాల్సి ఉన్నందున మరోసారి గాయాల బారిన పడకుండా ఉండాలనే ఈ ఎంపికపై బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతన్ని జట్టులోకి తీసుకోనుంది. న్యూజిలాండ్తో జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్కు బుమ్రా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎన్సీఏలోనే బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
ఇక శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే తొలి వన్డేకు వేదిక అయిన గౌహతికి చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఈ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు ఈ సిరీస్ నుంచే సన్నాహకాలు మొదలు పెట్టనున్నారు.