
సెంచరీ చేసినా..
న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేసిన శ్రేయాస్ అయ్యర్.. అరంగేట్రం టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్తోనే అయ్యర్ సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ వరుసగా రెండు టెస్ట్ల్లో అతను చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వరుసగా విఫలమవుతున్నా.. టీమ్మేనేజ్మెంట్ వారికి అనుభవం పేరిట వరుసగా అవకాశాలు కల్పిస్తోంది. ఇక కోహ్లీ గైర్హాజరీలోనైనా అయ్యర్కు అవకాశం దక్కుతుందని భావించగా.. మొండి చెయ్యే ఎదురైంది. దీంతో భారత అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు టీమ్మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టారు.

కడుపునొప్పి రావడంతోనే..
మంచి ఫామ్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ని తప్పించి విహారిని ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నించారు. జొహనెస్బర్గ్లో తుది జట్టు ఎంపికపై విమర్శలు రావడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు రోజు అయ్యర్.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడని, అందుకే రెండో టెస్ట్ సెలక్షన్కు అతను అందుబాటులో లేకుండా పోయాడని వివరించింది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న విహారీకి.. కోహ్లీ స్థానంలో అవకాశం కల్పించామని స్పష్టం చేసింది. ఇక, విహారి.. సరిగ్గా ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలోని సిడ్నీ టెస్ట్లో విహారి చివరిసారి టీమిండియా తరఫున ఆడాడు. ఆ మ్యాచ్లో గాయంతో బాధపడుతున్నా.. పోరాడి ఓటమిని తప్పించాడు.

బ్యాట్స్మెన్ తడబాటు..
ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫస్ట్ టెస్ట్లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లతో 26) ఆ జోరును కొనసాగించలేకపోయాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ స్వేచ్చగా ఆడలేక ఓలివర్ బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

టీమిండియా 146/5
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హనుమ విహారీ(53 బంతుల్లో 3 ఫోర్లతో 20)తో కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50 ) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రబడా విడదీసాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతన్ని జాన్సెన్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్(21 బంతుల్లో 4 ఫోర్లతో 24 బ్యాటింగ్), రిషభ్ పంత్(32 బంతుల్లో ఫోర్తో 13 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా రెండో సెషన్ ముగించారు. దాంతో భారత్ 146/5 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.


Click it and Unblock the Notifications












