ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి రారాజుగా నిలిచింది. రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఈ ఏడాది భారీ లాభాలను నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా రూ.3,358 కోట్ల లాభాన్ని అందుకుంది. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ నిషేధం, ఐసీసీ ఆదాయంలో వాటా తగ్గడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ బీసీసీఐ తన ఆర్థిక పటిష్టతను చాటుకుంది.
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అందించిన వివరాల ప్రకారం బోర్డు జనరల్ ఫండ్ వృద్ధి గతేడాది రూ.7,988 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది రూ.11,346 కోట్లకు పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో ఈ లాభం రూ. 6, 728 కోట్లకు పెరుగుతుందని బోర్డు అంచనా వేస్తోంది.

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టాల కారణంగా డ్రీమ్ 11 టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్గా మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆన్లైన్ గేమింగ్ చట్టాల కారణంగా మధ్యలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. డ్రీమ్ 11 తప్పుకోవడం కూడా బీసీసీఐకి కలిసొచ్చింది.
నయా జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్తో బీసీసీఐ భారీ డీల్ కుదుర్చుకుంది. అపోలో టైర్స్.. మ్యాచ్కు రూ. 4.5 కోట్లు చెల్లిస్తుండగా.. డ్రీమ్ 11 మ్యాచ్కు రూ. 4 కోట్లు చెల్లించేది. దాంతో బీసీసీఐకి కొత్త స్పాన్సర్షిప్ డీల్ ద్వారా మ్యాచ్కు రూ.50 లక్షల ఆదాయం అదనంగా లభించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది.
బోర్డు తమ నిధులను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల వడ్డీ రూపంలోనే సుమారు రూ.1,500 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది వడ్డీ ఆదాయం రూ.1,368 కోట్లు మాత్రమే. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ల మీడియా రైట్స్, ఇతర వాణిజ్య ఒప్పందాల ద్వారా బీసీసీఐ భారీ ఆదాయాన్ని పొందింది.
ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం వాటాలో తగ్గుదల ఉన్నప్పటికీ.. బోర్డు స్వయం సమృద్ధి, సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికతో ప్రపంచంలోనే ధనిక స్పోర్ట్స్ బోర్డుగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ నుంచి బీసీసీఐ అత్యధికంగా 38.5 శాతం వాటాను పొందుతుంది.
భారీ లాభాలను పొందిన బీసీసీఐ.. భవిష్యత్తు అవసరాల కోసం భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. మౌలిక సదుపాయల కోసం రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల స్టేడియాల అభివృద్ధి, సబ్సిడీల కోసం రూ. 500 కోట్లు పక్కనపెట్టింది. ఆదాయపన్ను చెల్లింపుల కోసం రూ.3,320 కోట్లు, అత్యవసర నిధిగా రూ.1,000 కోట్లు, కోర్టు కేసులు, ఇతర ఖర్చుల కోసం రూ.160 కోట్లు కేటాయించింది.