
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి చికిత్స కొనసాగుతోందని, తదుపరి చికిత్స అంశంపై సోమవారం మెడికల్ బోర్డు సమావేశమవుతుందని వుడ్ల్యాండ్స్ హాస్పిటల్ తెలిపింది. ఈ మేరకు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. ఇక స్వల్ప గుండెపోటుతో గంగూలీ శనివారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
జిమ్లో ఉండగా గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 'ఇంటి జిమ్లో ట్రెడ్మెల్ చేస్తుండగా గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. అతని కుటుంబానికి గుండెజబ్బు చరిత్ర ఉంది'' అని ఆస్పత్రి తొలుత బులిటెన్ విడుదల చేసింది. గంగూలీకి యాంజియోప్లాస్టీ జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా స్పృహలో ఉన్నాడని పేర్కొంది. గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నాయని, వాటికి చికిత్స అందిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆస్పత్రి మెడికల్ బోర్డు సమావేశమవుతున్నట్లు సమాచారం.
48 ఏళ్ల గంగూలీ 2019 అక్టోబరు నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీసీసీఐ కార్యదర్శి జై షా సహా అనేక మంది ప్రముఖులు, మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు, క్రికెట్ పాలకులు గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.