న్యూఢిల్లీ: దేశంలో క్రికెట్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. తాజాగా లాక్డౌన్లో వెసులుబాటు కల్పించినప్పటికీ క్రికెట్ మ్యాచ్ల ఆరంభంపై స్పష్టత లేదని అన్నాడు. 'రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అన్ని అంశాలనూ పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ జరిగినా ఎక్కడ జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. అనుకూల వాతావరణం ఉంటే భారత్లోనే జరుగుతుంది. అయితే ఇప్పుడేం చెప్పినా తొందరపాటే అవుతుంది. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ గురించి మేమింకా చర్చించలేదు' అని గంగూలీ చెప్పాడు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి ప్రారంభంకావాల్సిన టీ20 వరల్డ్కప్ను కరోనా వైరస్ కారణంగా ఐసీసీ వాయిదావేయాలని ప్రాథమికంగా నిర్ణయించడంతో.. అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని దాదా తెలిపాడు.
భారత్లో సోమవారం రాత్రికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరుకోగా.. ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్కి తాము ఆతిథ్యమిస్తామని ఇప్పటికే శ్రీలంక, యూఏఈ ముందుకు వచ్చాయి. కానీ.. బీసీసీఐ మాత్రం వారి ప్రతిపాదన గురించి స్పందించలేదు.
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి టోర్నీని వాయిదా వేసిన బీసీసీఐ.. లాక్డౌన్ని ప్రభుత్వం పొడిగించడంతో ఐపీఎల్ని నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్లో పరిస్థితులు అదుపులోకి రాకుంటే లీగ్ను విదేశాల్లోకి తరలించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.